ఒకరి సౌకర్యం కోసం మరొకరిని ముంచొద్దు ​గడ్డిఅన్నారం ప్రజలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఒకరి సౌకర్యం కోసం మరొకరిని ముంచొద్దు  ​గడ్డిఅన్నారం ప్రజలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్:

అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, గడ్డిఅన్నారం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ముంపు సమస్య పరిష్కారానికి తాను నిరంతరం అండగా ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న స్టార్మ్ వాటర్ అవుట్ లెట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​అధికారుల తీరుపై ఆగ్రహం:

జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు ప్రజావసరాలను విస్మరించి, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పనులు చేపట్టడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎల్బీనగర్ నుంచి సాయి ఫంక్షన్ హాల్, పాత పోస్ట్ ఆఫీస్ మీదుగా సరూర్ నగర్ చెరువు వరకు నిర్మిస్తున్న స్టార్మ్ వాటర్ లైన్ వల్ల భవిష్యత్తులో కోదండరామ్ నగర్, తిరుమల నగర్, వివేకానంద నగర్, కమలా నగర్ కాలనీలకు మళ్లీ ముంపు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బైరామల్ గూడ, శాతవాహన నగర్ వంటి ప్రాంతాల్లో వరద ముప్పును తప్పించేందుకు తాము ఎంతో శ్రమించి బాక్స్ డ్రైయిన్ల నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

​ప్రజాధనం వృథా చేయొద్దు:

"వాస్తవానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) లైన్‌ను ఎస్టీపీ (STP) లో కలిపి, శుద్ధి చేసిన నీటిని మాత్రమే చెరువులోకి వదలాలి. కానీ, ప్రస్తుత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దీనిని స్టార్మ్ వాటర్ లైన్‌గా మార్చి నేరుగా అవుట్‌లెట్‌కు కలపడం సరికాదు" అని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తూ, లోతట్టు ప్రాంత ప్రజల ప్రాణాలను, ఆస్తులను పణంగా పెట్టవద్దని హెచ్చరించారు.

​మార్పులు చేసే వరకు పోరాటం:

ప్రస్తుత పైప్‌లైన్ ప్రణాళికను మార్చి, దానిని ఎస్టీపీకి అనుసంధానించేలా అధికారులపై ఒత్తిడి తెస్తానని ఆయన కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనులు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, రమణా రెడ్డి, యాద శంకర్, నాగిరెడ్డి, రాము తదితర కాలనీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author