గర్గుల్ గ్రామంలో నాటు బాంబు పేలిన ఘటనలో ఓ కుక్క మృతి..

కామారెడ్డి జిల్లా :
కామారెడ్డి మండల పరిధిలోని గర్గుల్ గ్రామంలో నాటు బాంబు పేలి కుక్క మృతి చెందింది. గ్రామస్తుల వివరాల మేరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గర్గుల్ గ్రామానికి చెందిన మొగుళ్ల సాయాగౌడ్ కు చెందిన పంట చేనులో శనివారం ఉదయం సమయంలో సాయాగౌడ్ తమ్ముడు రామా గౌడ్ పొలానికి నీళ్లు పారించడానికి వెళ్ళాడు. అదే అటుగా భారీ శబ్దం రావడంతో వెళ్లి చూడగా ఓ కుక్క తల పగిలి చనిపోయింది. ఆ ప్రాంతంలో పొగ రావడాన్ని గమనించిన రామా గౌడ్ నాటు బాంబు పేలినట్టు గుర్తించారు. ఎవరొ గుర్తు తెలియని వ్యక్తులు తమ పంట చేనులో బాంబులు పడేసి ఉండటంతో అది తెలియని కుక్క నోట పట్టుకోవడంతో తలపగిలి మృతి చెందినట్లు తెలిపారు. తమకు హాని చేయడానికే బాంబులు పడేసి ఉంటారని బాధిత పంట చేను రైతు అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చేనులో బాంబులు పడేసి తమకు హాని కలిగించాలని ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయాగౌడ్ తో పాటు చుట్టుపక్కల రైతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అడవి పందుల కోసం ఎవరైనా పెట్టి ఉంటారా? లేదా కావాలని పెట్టారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
