మరో 9 గిన్నిస్ రికార్డులు లక్ష్యంగా..
- చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న గీతం పూర్వ విద్యార్థిని శివాలి

సంగారెడ్డి :
మరో తొమ్మిది గిన్నిస్ వర్డల్ రికార్డులతో చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో గీతం పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ ముందుకు సాగుతోంది. తన తల్లి కవితా జోహ్రి శ్రీవాస్తవతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి కళా ప్రదర్శనను హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసింది.
శివాలి జోహ్రి శ్రీవాస్తవ ఇప్పటికే 21 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తో పేపర్ ఆర్ట్ ప్రపంచంలో ఒక ప్రసిద్ధ పేరు సాధించి, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో గిన్నిస్ వరల్డ్ రికార్డులను కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచారు. ఆమె సాధించిన విజయాలలో వేలకొద్దీ చేతితో తయారు చేసిన కాగితపు బొమ్మలు, క్విల్డ్ పువ్వులు, ఓరిగామి జంతువులు, వాహనాలు, పక్షులు, ఆకులు, అలంకాల రూపాల రికార్డు బద్దలు కొట్టే ప్రదర్శనలు ఉన్నాయి. ఇవి అసాధారణమైన ఖచ్చితత్వం, సృజనాత్మకత, అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి.
గీతం ఉన్నతాధికారులు- హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, వివిధ విభాగాధిపతులు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు శివాలి ఈ కొత్త ప్రపంచ మైలురాళ్లను సాధించాలని అభిలషిస్తున్నారు.
