నేడు మిరుదొడ్డిలో రక్తదాన శిబిరం
- - యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపు
- నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ నిర్వహకులు
సిద్దిపేట:
నేడు (సోమవారం) నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలనీ నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ నిర్వహకులు పిలుపునిచ్చారు.ఈ మేరకు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు,గ్రామ సర్పంచ్ మహేశ్వరి దేవరాజు పత్రిక విలేకర్లతో మాట్లాడారు. మండలంలోని రామాలయం కల్యాణ
మండపంలో నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని వారు కోరారు.అత్యవసర సమయాల్లో మనం చేసే రక్తదానం ఒక యూనిట్ ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడడమే కాకుండా, దాతకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. నిర్దిష్ట వ్యవధిలో రక్తదానం చేయడం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం మనిషి చేయగలిగే అత్యంత గొప్ప సేవ అని వారు
పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అనేక ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు వంటి సందర్భాల్లో రక్తం అవసరం అవుతుందని, ఆ అవసరాలను తీర్చడానికి స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మల్లేశం, ఐలయ్య, విజయ్ కుమార్, సదానందం, పూస రాజు, సుధాకర్, యం రాజు తదితరులున్నారు.
