అక్షర వ్యాపారం.. ఫీజుల 'వేట'!
- ఎస్సార్ గాయత్రీలో ఫీజుల దందా.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!
- బకాయిలు ఉంటే ఫీజు తీసుకోబోం యాజమాన్యం మొండి వైఖరి
- బోధనలో వైఫల్యం.. ఫెయిల్యూర్ల ప్రభంజనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న "కార్పొరేట్ విద్యా నియంత్రణ జే.ఏ.సీ"
హైదరాబాద్:
రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చిన ఎస్సార్ గాయత్రీ జూనియర్ కళాశాలల యాజమాన్యం, నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. ఒకవైపు బోధనా ప్రమాణాలు పాటించక విద్యార్థులు పరీక్షల్లో విఫలమవుతుంటే, మరోవైపు సప్లమెంటరీ పరీక్ష ఫీజులను పాత బకాయిలతో ముడిపెట్టి వేధింపులకు గురిచేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి..jpeg)
బకాయిలు ఉంటే ఫీజు తీసుకోబోం
ప్రమాణాలు శూన్యం.. వసూళ్లు అమోఘం!
మౌలిక సదుపాయాల కొరత: అధిక ఫీజులు వసూలు చేస్తున్నా తరగతి గదుల్లో కనీస సౌకర్యాలు లేవు.
బోధనలో వైఫల్యం: అనుభవం లేని అధ్యాపకులతో పాఠాలు చెప్పించడం వల్ల విద్యార్థులు ఫెయిల్యూర్ల బాట పడుతున్నారు.
ఒత్తిడి తంత్రం: ఫెయిలైన విద్యార్థులను ఆదుకోవాల్సింది పోయి, ఫీజుల కోసం వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
చట్టం ఏం చెప్తోంది?
భారత రాజ్యాంగంలోని అధికరణ 21ఏ ప్రకారం విద్య ఒక ప్రాథమిక హక్కు. తెలంగాణ విద్యా చట్టం ప్రకారం, ఏ విద్యాసంస్థ కూడా విద్యార్థుల పరీక్ష ఫీజును నిలిపివేసే హక్కు కలిగి లేదు.
"ఫీజు బకాయిలు ఉంటే ధ్రువీకరణ పత్రాలు (TC, Marks Memo) ఇచ్చే సమయంలో వసూలు చేసుకోవచ్చు. కానీ, పరీక్ష రాయకుండా అడ్డుకోవడం ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ఉల్లంఘనే అవుతుంది."
*కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ.*
అధికారుల నిర్లక్ష్యంపై నిలదీత
కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు, ఏ. సాయికుమార్ శనివారం కాలేజీ యాజమాన్యాలను నిలదీశారు. ప్రైవేట్ కళాశాలలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. విచ్చలవిడి ఫీజుల వసూళ్లపై, ప్రమాణాలు పాటించని విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ఎస్సార్ గాయత్రీ వంటి కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి, విద్యార్థులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

