క్లీన్ సిటీయే లక్ష్యం.. ఇంజినీర్లకు శిక్షణ: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26పై అధికారుల ఓరియెంటేషన్
వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: అదనపు కమిషనర్ రఘు ప్రసాద్
హైదరాబాద్:
నగర పారిశుధ్య వ్యవస్థను బలోపేతం చేసి, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో హైదరాబాద్కు టాప్ ర్యాంకు తీసుకురావడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నూతనంగా నియమితులైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (SWM) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (DyEEs), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (AEEs), అసిస్టెంట్ ఇంజినీర్లకు (AEs) ప్రత్యేక ఓరియెంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్త్ అండ్ శానిటేషన్ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులకు క్షేత్రస్థాయి విధులపై దిశానిర్దేశం చేశారు.
రూల్స్ పాటించాల్సిందే..
ఈ సందర్భంగా రఘు ప్రసాద్ మాట్లాడుతూ.. నగరంలో పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇంజినీర్లు చురుగ్గా పనిచేయాలని సూచించారు. "ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు - 2024"లో జరిగిన తాజా సవరణలను వివరించారు. నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించడం ద్వారానే స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే ఆపరేషనల్ సవాళ్లను ఎలా అధిగమించాలో అధికారులకు వివరించారు.
SWM సూపరింటెండింగ్ ఇంజినీర్ గోపాల్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ 10వ ఎడిషన్ (2025-26) టూల్కిట్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా నిర్మాణ వ్యర్థాలు (C&D Waste), బల్క్ గార్బేజ్ జనరేటర్ల (BGG) నుంచి సేకరించే వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం అధికారులకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవసరమైన ఐఈసీ (IEC) మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ బాధ్యులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు
