ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్:
ప్రజావాణిలో పౌరుల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
70 ఫిర్యాదుల నమోదు
ఈ సోమవారం జరిగిన కార్యక్రమంలో మొత్తం 70 దరఖాస్తులు అందాయి. ఇందులో ప్రధాన కార్యాలయంలో 46, ఆరు జోన్ల పరిధిలో 24 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్, పరిష్కారం కోసం సంబంధిత విభాగాలకు వెంటనే పంపాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు. విభాగాల వారీగా పెండింగ్లో ఉన్న సమస్యలను సమీక్షించి, సాధ్యమైనంత త్వరగా పౌరులకు ఊరట కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రవికిరణ్, సత్యనారాయణ, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహారెడ్డి, సీసీపీ శ్రీనివాస్, సి.ఇ. సహదేవ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
17 Mar 2026
