హరితహారం కాదది.. అవినీతి ప్రసహనం..
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- ఎన్నెన్నో అవకతవకలు.. అంతులేని అవినీతి..
- రాష్ట్రాన్ని పచ్చదనం వైపు తీసుకెళ్లాలన్నది లక్ష్యం..
- కొంతమంది జేబులు నింపడానికి మాత్రమే అన్నది నిజం..
- సెలెబ్రెటీలను, వెండితెర నటీనటులను ముందుంచి ఆడిన నాటకం..
- నాటని మొక్కలను చూపించి బిల్లులు స్వాహా చేసిన వైనం..
- ప్రకృతితో వికృత క్రీడలు ఆడిన సోకాల్డ్ నాయకులు..
- గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల దోపిడి..
- ఇప్పటి ప్రభుత్వం విచారణ జరపడానికి ఎందుకు శంకిస్తోంది..?
- ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన అవినీతిపరులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు..?
- జరిగిన దోపిడీని వెలికితీసే పనిలో నిమగ్నమైన " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
.jpg)
ప్రకృతి బాగుంటే.. ప్రజలు శుభిక్షంగా ఉంటారు.. అవసరమైన ప్రకృతి వనరులు సంప్రాప్తిస్తాయి.. నీరు, గాలి స్వచ్ఛంగా అంది ప్రజల ఆరోగ్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి.. ఇది యుగ యుగాలుగా వస్తున్న సంప్రదాయం.. ఎంతోమంది మహానుభావులు ప్రకృతిని ప్రేమించారు.. ఆరాధించారు.. అడవుల పెంపకంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు.. వనజీవి రామయ్య లాంటి వారు ఎందరినో చూశాం.. చెట్లు పెంచడంపై ఆయన లాంటి వారు ఈ ప్రపంచానికి దిశా నిర్ధేశం చేశారు.. ఆ కోవలో ఎంతోమంది పయనించారు.. ప్రకృతిని పరిరక్షించారు.. బాగానే ఉంది.. కానీ కొంతమంది దూర్తులైన రాజకీయ నాయకులు ప్రకృతి సంరక్షణ పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న సంఘటనలు ఉన్నాయి.. ఈ కోవలోకే వస్తుంది గత ప్రభుత్వంలో అట్టహాసంగా ఆరంభించిన "హరితహారం" అనే ప్రక్రియ.. ఈ పథకం గురించి విన్నప్పుడు ఎంతో ఆనందం వేసింది.. ఒక అద్భుతమైన కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది అనిపించింది.. ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు.. సెలెబ్రిటీలను, వెండితెర వేల్పులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆహా అనిపించారు.. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే లోపే అసలు మర్మం కొంచెం కొంచెంగా అర్ధం అవ్వసాగింది.. ఇది ప్రకృతిని రక్షించే ప్రయత్నం కాదని.. దోచుకోవడానికి సరికొత్త ఎత్తుగడ అని తేటతెల్లమైంది.. ఒక్కటి కాదు రెండు కాదు.. వందలు.. వేలు కాదు లక్షలు, కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అంటే ప్రజా ధనాన్ని కొల్లగొట్టారు అని తెలిసిపోయింది.. మరి ఇంతటి అవినీతికి పాల్పడిన వారిపై విచారణ ఎందుకు జరుగలేదు..? వారిని ఎందుకు శిక్షించలేదు..? అనేది అర్ధంకాని ప్రశ్నగా మిగిలిపోయింది.. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అన్న చందాన ఈ అవినీతిలో గత ప్రభుత్వమే కాదు.. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా భాగస్వాములు అయ్యారనే అనుమానం వ్యక్తం చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
ఇక మొక్కల కొనుగోలు, సరఫరా లెక్కల్లో అవినీతితో కూడిన లోపాలు ఎన్నెన్నో ఉన్నాయి.. మొక్కల కొనుగోలు, రవాణా, నర్సరీ ఖర్చుల్లో లక్షల రూపాయలు అధిక బిల్లులు చూపించడం జరిగింది.. మరీ దారుణం ఏమిటంటే నర్సరీల నుంచి తక్కువ నాణ్యత గల మొక్కలను అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు వాస్తవ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. రికార్డులు కూడా తారుమారు చేసినట్లు తెలుస్తోంది..
ఏదైతే ఒక మంచి లక్ష్యంతో మొదలు పెట్టారో కార్యాచరణలో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.. అందులో ముఖ్యంగా మొక్కల సంరక్షణ అన్నది లేనేలేదు.. ఇక మొక్కుబడిగా నాటిన మొక్కలకు నీరు, సంరక్షణ లేకపోవడం వల్ల ఎక్కువ శాతం చనిపోవడం జరిగింది.. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాక, వారి డబ్బులు వారికి రాగానే మొక్కలను పర్యవేక్షించడం వదిలేశారు..
ఈ క్రమంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పాలయ్యాయి.. ఇక పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ విభాగాలకు కేటాయించిన నిధులు సరైన విధంగా వినియోగం కాకపోవడం ఒక దుర్మార్గమైన చర్య.. నకిలీ బిల్లులు, నకిలీ రశీదులు సృష్టించి వాటిని చూపించి కోట్లలో నిధులు మింగేశారు..
దీని ఫలితంగా పథకం ప్రారంభ ఉద్దేశం మేరకు పచ్చదనం పెరగకపోవడం జరిగింది.. ఈ హరితహారం ప్రాజెక్టుపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోయింది.. పర్యావరణాన్ని రక్షించాలనే లక్ష్యం నిర్వీర్యమైపోయింది.. హరితహారం పథకం మంచి లక్ష్యం కోసం రూపొందించబడినా, సరైన పర్యవేక్షణ లేకపోవడం, అవినీతి కారణంగా దీని ప్రభావం తగ్గిపోయింది. నిజంగా రాష్ట్రం పచ్చగా మారాలంటే, అవకతవకలు అరికట్టి, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం తప్పనిసరి.
రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం పథకం గొప్ప లక్ష్యాలను చేరుకోవాల్సింది పోయి, అవినీతి నాయకుల జేబులు నింపడానికి పనికివచ్చింది అని వాపోతున్నారు మేధావులు.. ఈ మహత్తర కార్యక్రమంలో అవకతవకలు, అవినీతి పెద్దగా చోటుచేసుకున్నాయని వారు నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడం దురదృష్టం.. ప్రభుత్వం రికార్డుల్లో లక్షలాది మొక్కలు నాటినట్లు చూపుతున్నప్పటికీ, భూస్థాయిలో పరిశీలిస్తే అవి కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం తగిన విచారణ జరిపించి.. అవినీతికి పాల్పడినవారు ఎవరైనా, ఎంతటివారైనా, ఖచ్చితంగా శిక్షించాలని, కాజేసిన ప్రజాధనాన్ని వెంటనే కక్కించాలని, లేని పక్షంలో హరితహారం పథకం అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
ప్రకృతిని కూడా అవినీతి సంపాదన కోసం వాడుకున్న సోకాల్డ్ లీడర్స్ భారతం పట్టాలి.. ప్రకృతిని పరిరక్షించాలి.. హరిత తెలంగాణ దిశగా అడుగులు పడాలి.. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని వాస్తవాలను వెలికితీసి ప్రజలముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం..
