​రూ. 1,511 కోట్ల విలువైన భూములను రక్షించిన హైడ్రా..

​నగరం నలువైపులా హైడ్రా మెరుపు దాడులు

  • చెరువులు, పార్కు స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • జంగం కుంట, అల్వాల్ కొత్త చెరువుల్లో 12 ఎకరాల స్వాధీనం
  • ​ఆక్రమణదారుల చెర నుంచి విముక్తి పొందిన పార్కులు

​రూ. 1,511 కోట్ల విలువైన భూములను రక్షించిన హైడ్రా..

​హైదరాబాద్: 

నగరంలోని విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కు స్థలాలను కబ్జాదారుల నుంచి కాపాడేందుకు 'హైడ్రా' (HYDRAA) తన దూకుడును కొనసాగిస్తోంది. మంగళవారం ఒకే రోజు నగరం నలువైపులా నాలుగు ప్రధాన ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు.. సుమారు రూ. 1,511 కోట్ల విలువైన ఆక్రమణలను తొలగించారు. స్వాధీనం చేసుకున్న భూములకు తక్షణమే రక్షణ కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేసి, ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను అమర్చారు.

​కొండాపూర్‌లో రూ. 700 కోట్ల భూమి స్వాధీనం

​శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని మదీనాగూడ రోడ్డులో ఉన్న 'జంగం కుంట'ను కబ్జాదారుల నుంచి అధికారులు విముక్తి చేశారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలోని ఈ చెరువును మట్టితో పూడ్చివేసి, ప్లాట్లుగా విక్రయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. రెవెన్యూ అధికారులతో కలిసి నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఇది చెరువు భూమిగా నిర్ధారణ కావడంతో, కమిషనర్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేశారు. ఈ భూమి విలువ సుమారు రూ. 700 కోట్లు ఉంటుందని అంచనా.

​అల్వాల్‌లో ప్లాస్టిక్ యూనిట్లపై వేటు

​అల్వాల్ మండలంలోని 'కొత్త చెరువు' ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో అక్రమంగా కొనసాగుతున్న కార్యకలాపాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఎనిమిది ఎకరాల మేర విస్తరించిన ఆక్రమణలను తొలగించింది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, వ్యర్థాల సేకరణ కేంద్రం వల్ల చెరువు కలుషితమవుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అక్కడ నిర్మించిన తాత్కాలిక షెడ్లను కూల్చివేసి చెరువు పరివాహక ప్రాంతాన్ని పునరుద్ధరించారు.WhatsApp Image 2026-02-10 at 19.45.47

​ప్రజావాణి ఫిర్యాదులతో పార్కులకు విముక్తి

​జనవాసాల మధ్య ఉన్న పార్కు స్థలాల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా తక్షణమే స్పందించింది.

​జక్కిడి కాలనీ: వనస్థలిపురం సాహెబ్‌నగర్ కలాన్‌లోని జక్కిడి నగర్ కాలనీలో 1982లో కేటాయించిన 650 గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ప్రహరీ గోడ, రెండు షెడ్లను అధికారులు కూల్చివేశారు. లేఅవుట్ నిర్వాహకులే ఈ స్థలాన్ని తిరిగి అక్రమంగా విక్రయించడాన్ని గుర్తించిన అధికారులు.. దానిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు.

​రాధాకృష్ణ నగర్: మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయ నగర్ రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కు స్థలాన్ని కాపాడారు. గతంలో జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్ ద్వారా లభించిన ఈ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను మంగళవారం తొలగించారు.

​చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, ప్రజలు కూడా ఇటువంటి అక్రమాలపై ఫిర్యాదు చేయాలని హైడ్రా అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.WhatsApp Image 2026-02-10 at 19.44.55

About The Author