ప్లాట్ కొంటున్నారా.. మీ డబ్బు గాలిలో కలవకముందే జాగ్రత్త!
హైదరాబాద్:
హైదరాబాద్లో ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకుంటున్నారా? అయితే, బిల్డర్ల మాటలు నమ్మి మోసపోకండి. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే అడుగు ముందుకు వేయాలని హైడ్రా (HYDRAA) తీవ్రంగా హెచ్చరించింది. ప్రజావాణిలో వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ప్లాట్లు కొనవద్దని ప్రజలకు సూచించింది.
ఏం చూడాలి?
చెరువుల ముప్పు: కొనే ప్లాట్ చెరువు ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉందేమో గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకోండి.
అనుమతులు: హెచ్ఎండీఏ లేఅవుట్ అనుమతులు ఉన్నాయా? లేదా? అనేది ఆన్లైన్లో వెరిఫై చేసుకోండి.
దారి సౌకర్యం: గేటెడ్ కమ్యూనిటీల పేరుతో అమ్ముతున్నారు.. కానీ బయటి కాలనీలకు కనీసం 40 అడుగుల రోడ్డు ఉందో లేదో చూడండి.
నకిలీ నంబర్లు: కేవలం ఇంటి నంబర్లు, బై-నంబర్లతో అమ్మే ప్లాట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి.
ప్రజావాణిలో బయటపడ్డ అక్రమాలు
సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 48 ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీటిని క్షుణ్ణంగా పరిశీలించారు. శాటిలైట్ మ్యాప్స్ ద్వారా స్థలాలను చూసి, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధానాంశాలు:
పటాన్చెరు అరాచకం: 92 ఎకరాల లేఅవుట్లో 32 ఎకరాల భూమి వివాదంలో ఉంది. భూమి అమ్మిన పాత రైతులు, స్థానిక నేతల అండతో మళ్ళీ నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి అమ్ముతున్నారు.
చెరువుల్లో కాలుష్యం: బాచుపల్లి చెరువులోకి మురుగునీరు వచ్చి చేరుతోంది. చెరువును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు.
ముంపు కష్టాలు: అమీన్పూర్ చెరువులో లేఅవుట్లు మునిగిపోతున్నాయని, నివాసయోగ్యం కాకుండా మారిందని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ సొసైటీ వాపోయింది.
కబ్జా పర్వం: కాప్రా, బాలానగర్లలో పార్కు స్థలాలను కబ్జా చేసి గుడులు కట్టడం, షెడ్లు వేయడంపై బాధితులు హైడ్రాను ఆశ్రయించారు.
ప్రజల ఆస్తులను కాపాడేందుకు తాము కఠినంగా వ్యవహరిస్తామని, అక్రమాలకు పాల్పడే వారిపై ఉపేక్షించేది లేదని హైడ్రా స్పష్టం చేసింది..jpeg)
