మల్కాజిగిరిలో మందుబాబుల ఆటకట్టు: వీకెండ్ తనిఖీల్లో 223 మంది దొరికారు!
మల్కాజిగిరి:
వీకెండ్ ఎంజాయ్మెంట్లో భాగంగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 223 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో అత్యధికులు టూవీలర్ రైడర్లే ఉండటం గమనార్హం.
ఎవరు.. ఎన్ని వాహనాలు?
పోలీసులు వెల్లడించిన గణాంకాల ప్రకారం పట్టుబడిన వాహనాల వివరాలు ఇలా ఉన్నాయి:
టూవీలర్లు: 194
ఫోర్ వీలర్లు (కార్లు): 21
త్రీ వీలర్లు (ఆటోలు): 08
భారీ వాహనాలు: సున్నా
మత్తు ‘రేంజ్’ ఇదీ..
బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో పట్టుబడిన వారి రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) విస్తుపోయేలా ఉంది.
36 - 200 mg: 204 మంది
201 - 300 mg: 10 మంది
301 - 550 mg: 09 మంది (తీవ్ర మత్తులో ఉన్నవారు)
గత వారం (మార్చి 8 నుండి 14 వరకు) కోర్టులో హాజరుపరిచిన కేసుల్లో 238 మందికి శిక్షలు పడ్డాయి. ఇందులో ఎనిమిది మందికి జైలు శిక్షతో పాటు జరిమానా, 11 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ, మిగిలిన 219 మందికి కేవలం జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
డిసిపి హెచ్చరిక: "మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే, భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్ 105 కింద 'హత్యానేరం కాని సాపరాధ నరహత్య' కేసు నమోదు చేస్తాం. దీనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రాణాలతో చెలగాటం వద్దు."
— డిసిపి, మల్కాజిగిరి కమిషనరేట్.

