జనసంద్రంగా మారిన మేడారం
జంపన్న వాగులో పుణ్యస్నానాలు, అమ్మవార్లకు మొక్కులు చెల్లింపు
ములుగు:
సంక్రాంతి పండుగ ముగియడంతోనే మేడారం మహాజాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మేడారం జాతర భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది. లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకుని ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించేందుకు బంగారు బుట్టలను తలపై పెట్టుకొని గద్దల వద్దకు చేరుకున్నారు.
తమ కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలకు భక్తులు వడి బియ్యం, బంగారం, చీర, సారె, పసుపు–కుంకుమతో పాటు బంగారాన్ని నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులను
చెల్లించుకున్నారు. అమ్మవార్ల దయతో తమ కుటుంబాలు సుఖశాంతులతో, పిల్లా పాపలు పాడిపంటలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని భక్తులు మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
మొక్కులు చెల్లించిన అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా కంక వనాల (వెదురు అడవులు) మధ్య ఉన్న పచ్చని ప్రకృతిలో వంటావార్పు చేసుకుని, పిల్లలతో కలిసి సంతోషంగా సమయం గడిపారు. జాతర ఆనందాన్ని మనసారా అనుభవించిన భక్తులు, అమ్మవార్ల కృపతో తిరిగి తమ ఇళ్లకు ప్రయాణమవుతూ మేడారం మహాజాతరను మరపురాని అనుభూతిగా మలుచుకున్నారు.
