కర్మాన్ఘాట్ బాధితులకు అండగా రాజ్యాధికార పార్టీ
ఎల్బీనగర్:
కర్మాన్ఘాట్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలను దేవాలయ భూముల పేరుతో ఖాళీ చేయించడం అన్యాయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
అనుమతులిచ్చి ఇప్పుడెలా తొలగిస్తారు?
సుమారు 35 ఏళ్ల క్రితం రియల్టర్లు లేఅవుట్ చేయగా, బాధితులు చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని వాసుదేవ్ పేర్కొన్నారు. ఇళ్లు కట్టుకునే సమయంలో అధికారులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, అన్ని అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. దశాబ్దాల తర్వాత అకస్మాత్తుగా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమనడం పేదల జీవనాధారాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. బాధితుల కోసం అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు అంజన్ కుమార్ యాదవ్, చంపపేట్ డివిజన్ అధ్యక్షుడు సందీప్, ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు సంపత్, నాగోల్ డివిజన్ అధ్యక్షుడు గుడికందుల సురేందర్, పన్నాల అజయ్ కుమార్, రాజు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
