యువ "ఆపద మిత్రులతోనే" సమాజానికి భరోసా
- ప్రమాద సమయాల్లో మీరే తొలి స్పందనశీలురు
- 3వ బ్యాచ్ శిక్షణలో హైడ్రా అదనపు డైరెక్టర్ పాపయ్య
హైదరాబాద్:
ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు సామాన్య ప్రజలను ఆదుకోవడంలో 'యువ ఆపద మిత్రులు' కీలక పాత్ర పోషించాలని హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఫతుల్గూడలోని హైడ్రా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన 'యువ ఆపద మిత్ర' మూడవ బ్యాచ్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదలు, అగ్నిప్రమాదాల వంటి క్లిష్ట పరిస్థితుల్లో స్థానికంగా అందుబాటులో ఉండే వాలంటీర్లు తక్షణ సహాయం అందించే సమర్థ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
వారం రోజుల పాటు మెలుకువలు
ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఈ శిక్షణలో ప్రమాదాల సమయంలో ప్రాణనష్టాన్ని ఎలా తగ్గించాలి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి అనే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
నాయకత్వం: గందరగోళ పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం కోల్పోకుండా నాయకత్వం వహించడంపై శిక్షణ ఉంటుంది.
విస్తరణ: ఇక్కడ శిక్షణ పొందిన ప్రతి వాలంటీర్ మరో పది మందిని సిద్ధం చేసి, సమాజానికి భరోసా కల్పించాలని సూచించారు.
105 మంది యువతకు శిక్షణ
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎంపికైన 105 మంది యువ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాల వంటి సమయాల్లో స్పందించే తీరు, ప్రాథమిక చికిత్స (First Aid) అందించే పద్ధతులపై వీరికి నిపుణులు శిక్షణ ఇస్తారు.
చెరువుల అభివృద్ధే లక్ష్యం..
ఈ సందర్భంగా పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు హైడ్రా కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి ద్వారా భవిష్యత్తులో వరదలు లేని హైదరాబాద్ నగరాన్ని చూడాలని ఆశిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
