హయత్‌నగర్ రోడ్ల విస్తరణకు శ్రీకారం

  • ​రూ.10 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి
  • ​రూ.950 కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం
  • ​పాల్గొన్న మధుయాష్కీ గౌడ్, మల్‌రెడ్డి రాంరెడ్డి.

హయత్‌నగర్ రోడ్ల విస్తరణకు శ్రీకారం

హయత్‌నగర్:

హయత్‌నగర్ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్న సాయిబాబా దేవాలయం నుండి జీ హై స్కూల్ వరకు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్‌డీసీ) చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.

​రూ.950 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్:
​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 

చింతల్‌కుంట చెక్‌పోస్ట్ నుంచి హయత్‌నగర్ మీదుగా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు సుమారు 5.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. నాగ్‌పూర్ నమూనాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా దీనిని రూపొందిస్తున్నామని, ఇందుకు రూ.950 కోట్లు ఖర్చవుతాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధిపై మల్‌రెడ్డి రాంరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ప్రశంసించారు.
​వేగంగా టెండర్ల ప్రక్రియ
​మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే రూ.400 కోట్ల విలువైన రహదారి పనులకు టెండర్లు ఆహ్వానించామని, మరో రూ.600 కోట్ల పనులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
​హయత్‌నగర్ నుంచి అనాజ్‌పూర్ మీదుగా కోహెడ ఫ్రూట్ మార్కెట్ వరకు రూ.200 కోట్లతో రహదారి నిర్మాణానికి అనుమతులు లభించాయి.

​హయత్‌నగర్ నుంచి సాగర్ రోడ్డులోని ఇంజాపూర్ వరకు నాలుగు వరుసల రహదారిని నిర్మించనున్నారు.
​తారామత్‌పేట్ వరకు కుంట్లూరు, పసుమాముల మీదుగా మరో నాలుగు వరుసల రహదారి మంజూరైంది.WhatsApp Image 2026-03-15 at 19.37.58

​మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రహదారి అభివృద్ధి పనులతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, మల్‌రెడ్డి రాంరెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author