కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ పండుగ ప్రారంభం
సంగారెడ్డి :

మహిళలందరూ బతుకమ్మను ఆడి, పాడి గౌరమ్మను పూజించడం ఈ పండుగ ప్రత్యేకత అని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాంప్రదాయ ఉత్సవం బతుకమ్మ పండుగను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు. మొదటి రోజు ఉత్సవాలను రెవెన్యూ, సర్వే, ల్యాండ్ రికార్డుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా సబ్ కలెక్టర్ ఉమా హారతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, కలెక్టరేట్ విభాగాల మహిళా అధికారులతో కలిసి కలెక్టర్ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భముగా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ ను గ్రామాలు ,పట్టణాలలో మహిళలు , ఆనందంగా జరుపుకునే పూల పండుగ అని అన్నారు . మహిళలు సాంప్రదాయ గా పూలతో అలంకరించిన బతుకమ్మను గౌరమ్మ కు అర్పిస్తూ కొలుస్తారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మహిళలు పూలతో అలంకరించిన బతుకమ్మను ఉత్సాహంతో ఆడుతూ పాటలతో పూజిస్తారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల సాంస్కృతిక గుర్తుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. తొమ్మిది రోజుల పాటు దైవభక్తి, ఆనందోత్సాహంతో పండుగను జరుపుకోవాలని, అందరూ సంతోషంగా ఈ ఉత్సవాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కలెక్టర్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్ అధికారి ఐనెస్ , పి డి ఐ సి డి ఎస్ లలితకుమారి , రెవెన్యూ , సర్వే ల్యాండ్ రికార్డ్ శాఖ,కలెక్టరేట్ లోని వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
