రంగారెడ్డి కలెక్టరేట్:
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సాగుతున్న పోరాటం సత్ఫలితాలనిస్తోందని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలపై స్పందించడం తెలంగాణ జాగృతి పోరాట పటిమకు దక్కిన విజయమని అభివర్ణించారు.
పోరాట ఫలితమే మంత్రి హామీ:
రాష్ట్రం సిద్ధించి ఇన్నేళ్లవుతున్నా ఉద్యమకారులకు ఆశించిన గుర్తింపు, ఆత్మగౌరవం లభించలేదని పాండురంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. "ఉద్యమకారుల సమస్యలను విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న" తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరికతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. ఈ ఒత్తిడి వల్లే మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వచ్చి ఉద్యమకారుల వినతులను స్వీకరించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
కేటీఆర్ మౌనంపై విస్మయం:
మరోవైపు, ఉద్యమకారుల సమస్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మౌనం వహించడాన్ని పాండురంగారెడ్డి తప్పుబట్టారు. ఒకవైపు కవిమ్మ పోరాడుతుంటే, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి, అసలైన పోరాట యోధులను విస్మరించామన్న అపరాధ భావనతోనే ఆయన ముఖం చాటేస్తున్నారా అని విమర్శించారు. ఉద్యమకారుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.