హైరైజ్ కమిటీ ‘మాయాజాలం’.. ఎఫ్టీఎల్ పరిధిలో 17 అంతస్తుల అక్రమ సౌధం!
- *నోటీసుల పేరుతో సాగతీత.. బడా బిల్డర్ల ముందు టౌన్ ప్లానింగ్ ‘జీ హుజూర్’?
- *నాటి టీఎస్-బీపాస్ (TS-bPASS) లొసుగులతో వందల కోట్ల దందా.. నేడు ‘బిల్డ్ నౌ’ (Build Now) లోనూ అదే రూటు!
- *విచారణకు వెళ్తే ముఖం చాటేసిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్.. స్పందించని యంత్రాంగంపై వెల్లువెత్తుతున్న విమర్శలు.
*హైదరాబాద్
చట్టం సామాన్యుడికి ఒకలా.. బడా బాబులకు మరోలా పనిచేస్తోందా? నిబంధనల పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చేందుకు ఉరుకులు పరుగులు పెట్టే టౌన్ ప్లానింగ్ అధికారులు, వందల కోట్ల సామ్రాజ్యం ఉన్న బడా బిల్డర్ల ముందు మోకాళ్లపై సాగిలపడుతున్నారా? అంటే అవుననే అంటోంది నగరంలో వెలుగుచూసిన తాజా భవన నిర్మాణ అనుమతుల కుంభకోణం!
గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్-బీపాస్ (TS-bPASS) చట్టాన్ని, అందులోని లొసుగులను వాడుకుని హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో (పూర్తి నీటి మట్టం - FTL / బఫర్ జోన్) ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు ఏకంగా 17 అంతస్తుల బహుళ అంతస్తుల భవనానికి (హైరైజ్ బిల్డింగ్) అనుమతులు జారీ చేయడం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు, హైరైజ్ బిల్డింగ్ కమిటీ పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..jpeg)
*నోటీసుల వెనుక ‘అంతర్యం’ ఏంటి?
ప్రస్తుత ప్రభుత్వం నీటిపారుదల శాఖ (ఇరిగేషన్ విభాగం) ఇచ్చిన ఫిర్యాదుతో ‘హైడ్రా’ (HYDRAA), మరియు జీహెచ్ఎంసీ (GHMC) సంయుక్తంగా రంగంలోకి దిగి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు చెందిన 17 అంతస్తుల నిర్మాణం పూర్తిగా అక్రమమని తేల్చి, నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడే అసలైన పరిశోధనాత్మక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.
*మొదటి తప్పు ఎవరిది?: రెవెన్యూ విచారణ లేకుండా, నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి అభ్యంతర పత్రం (NOC) తీసుకోకుండా అసలు టౌన్ ప్లానింగ్ విభాగం ఈ ఆకాశహర్మ్యానికి పచ్చజెండా ఎలా ఊపింది?
*హైరైజ్ కమిటీ ఉత్తి డొల్లేనా?: నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన 'ఉన్నత స్థాయి భవన నిర్మాణ కమిటీ' (హైరైజ్ బిల్డింగ్ కమిటీ) ఈ భారీ ఉల్లంఘనను ఎలా కళ్ళు మూసుకుని ప్రోత్సహించింది? దీని వెనుక చేతులు మారిన 'మూటల' కథ ఎంత?.jpeg)
"నగరీకరణ సులభతరం, అవినీతి రహితం" అంటూ గత ప్రభుత్వం ప్రచారం చేసిన టీఎస్-బీపాస్ లోని పారదర్శకత లోపాన్ని ఈ ఘటన బట్టబయలు చేసింది. నిన్న టీఎస్-బీపాస్, నేడు ‘బిల్డ్ నౌ’... పోర్టల్స్ పేర్లు మారినా తెరవెనుక చీకటి దందాల రూటు మారలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆన్లైన్ సిస్టమ్ అని చెబుతూనే, కీలకమైన చెరువుల ఎఫ్టీఎల్ మ్యాపులను, బఫర్ జోన్ డేటాన్ని ప్రజా పోర్టల్లో స్పష్టంగా ఉంచకుండా చీకట్లో ఉంచారు. ఇదే అదునుగా సామాన్యుల దరఖాస్తులను చిన్న చిన్న కారణాలతో తిరస్కరించే అధికారులు, ప్రదీప్ రెడ్డి లాంటి బడా బాబుల ఫైళ్లను మాత్రం టేబుల్ కింద చేతులు మారుస్తూ క్షణాల్లో క్లియర్ చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి.
సామాన్యుడి గుడిసెపై ప్రతాపం చూపే వ్యవస్థ, వందల కోట్ల సామ్రాజ్యాల ముందు మోకరిల్లడం మన నయా పారదర్శకతకు నిదర్శనం. పర్యావరణాన్ని బలిపెడుతూ, చారిత్రక సంపదను మింగేస్తున్న ఈ అధికార యంత్రాంగం తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కేవలం తాత్కాలిక స్వార్థం కోసం చట్టాన్ని తుంగలో తొక్కిన వారు భవిష్యత్తులో చట్టపరమైన చర్యలకు గురికాక తప్పదు..jpeg)
ఈ అక్రమ వ్యవహారాలపై 'భారత శక్తి' వరుసగా కథనాలు ప్రచురించినా యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం. దీనిపై వివరణ కోరేందుకు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లగా, అక్కడ సమాధానం చెప్పే వారే కరువయ్యారు. వందల కోట్ల నిర్మాణ సౌధం రేపు వివాదాల్లో చిక్కుకుని కొనుగోలుదారులు గగ్గోలు పెడితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?
ప్రభుత్వం కేవలం నోటీసులతో కాలయాపన చేయకుండా, ఈ అక్రమ అనుమతుల వెనుక ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులను, హైరైజ్ కమిటీ సభ్యులను తక్షణమే విధులనుంచి తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వారి ఆస్తులపై లోతైన దర్యాప్తు జరిపితేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఇప్పటికైనా ఉన్నత స్థాయి నిఘా విభాగాలు, ప్రభుత్వ పెద్దలు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని ‘భారత శక్తి’ డిమాండ్ చేస్తోంది.

