తండ్రి కష్టమే స్ఫూర్తి.. ...

  • - జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా 550వ ర్యాంక్ సాధించిన పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు - నర్ర రోహిత్
  • -  రోహిత్ ను అభినందించిన డీజీ (లా & ఆర్డర్) మహేష్ భగవత్, సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

తండ్రి కష్టమే స్ఫూర్తి.. ...

హైదరాబాద్:

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సివిల్ సప్లైస్ విజిలెన్స్ &  ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నర్ర ప్రభాకర్ కుమారుడు నర్ర రోహిత్ ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఆల్ ఇండియా 550 వ ర్యాంక్ సాధించి జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచాడు. 

ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రోహిత్, లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దేశవ్యాప్తంగా 550వ ర్యాంకును సాధించాడు. ఈ విజయంతో దేశంలోని ప్రతిష్టాత్మక  డిల్లీ ఐఐటీలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందనున్నాడు.

తండ్రి పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబం కోసం పడుతున్న కష్టాన్ని దగ్గరగా చూసిన రోహిత్, చదువే తన జీవితాన్ని మార్చే మార్గమని నమ్మి అంకితభావంతో సిద్ధమయ్యాడు. అతని కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కలిసి ఈ అద్భుత విజయానికి కారణమయ్యాయి.

నర్ర రోహిత్ సాధించిన ఈ ఘన విజయంపై తెలంగాణ డీజీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్, అలాగే తెలంగాణ సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ హర్షం వ్యక్తం చేశారు. రోహిత్‌ను, ఆయన తండ్రి నర్ర ప్రభాకర్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

పోలీస్ సిబ్బంది కుటుంబాల పిల్లలు కూడా కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ విజయాలు సాధించగలరని నర్ర రోహిత్ నిరూపించాడని వారు పేర్కొన్నారు. ఈ విజయం పోలీస్ కుటుంబాలకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభినందించారు.

About The Author