రక్షక భట నిలయానికి కేటాయించిన స్థలానికే రక్షణ కరువు..!
- చివరకు పోలీస్ స్టేషన్ స్థలానికే కన్నం వేసిన కబ్జాదారులు..
- కొత్తపేటలోని మోహన్ నగర్ లో హైడ్రా కూల్చివేతలు
ఎల్బీనగర్:
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కొత్తపేట–మోహన్నగర్లో హైడ్రా అధికారులు ఆక్రమణలపై కూల్చివేతలు చేపట్టారు.హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ నరసింహ, తహసీల్దార్ హేమమాలిని తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామ సర్వే నంబర్ 135లోని సుమారు 700 గజాల ప్రభుత్వ భూమిని 2007లో రెవెన్యూ శాఖ చైతన్యపురి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించింది.అయితే, కాలక్రమేణా కొందరు కబ్జాదారులు ఆ స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు నిర్మించుకుని వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చివరకు రక్షక భట నిలయం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిపైనే ఆక్రమణలు జరగడం గమనార్హంగా మారింది.చైతన్యపురి పోలీసుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారు.
అనంతరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు.ఈ కూల్చివేతల కార్యక్రమంలో చైతన్యపురి పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు..jpeg)
