మూసీ ప్రక్షాళనకు రూ. 7,345 కోట్లు!
- *తెలంగాణ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయాలు.. ఉపాధ్యాయులకూ ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం!
- *‘టిమ్స్’ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్.. కేంద్ర చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తీర్మానం!
హైదరాబాద్:
ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు సంచలన, ప్రజాకర్షక నిర్ణయాలకు వేదికైంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నదీ పరివాహక ప్రాంతాల పునరుజ్జీవనం, వైద్యారోగ్యం, విద్యా రంగాల బలోపేతానికి కేబినెట్ భారీ నిధులను, కొత్త ఉద్యోగాలను మంజూరు చేసింది.
*రూ. 7,345 కోట్లతో ‘మూసీ’ సుందరీకరణ!
రాజధాని నగరానికి మణిహారంగా నిలిచే మూసీ నదీతీర అభివృద్ధి (రివర్ఫ్రంట్ డెవలప్మెంట్) ప్రాజెక్టుకు మంత్రిమండలి భారీ ఊతమిచ్చింది. తొలి విడత పనుల కోసం ఏకంగా రూ. 7,345.12 కోట్ల వ్యయ ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
* ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ, నిర్వహణ కోసం కొత్తగా 147 పోస్టుల సృష్టికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
రాష్ట్ర చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకానికి కేబినెట్ తీపి కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఇకపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందికి కూడా ఉచితంగా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది' విద్యాశాఖ సిబ్బందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది.
*వైద్య రంగంలో కొలువుల జాతర: 6,278 పోస్టుల భర్తీ
రాష్ట్రంలో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు వీలుగా ‘టిమ్స్’ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రుల బలోపేతానికి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సనత్నగర్, ఎల్బీ నగర్, ఆల్వాల్, వరంగల్ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 6,278 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.
*నియమకాల విభజన: ఇందులో 1,494 శాశ్వత (రెగ్యులర్) పోస్టులు, 549 ఒప్పంద (కాంట్రాక్ట్) పోస్టులు, 4,235 బాహ్య వనరుల (ఔట్సోర్సింగ్) పోస్టులు ఉన్నాయి.
*కేంద్ర చట్టంపై సమరం.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం!
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన ‘వి.బి.జి. రామ్ జీ’ చట్టంపై కేబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం దేశ సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మంత్రిమండలి అభిప్రాయపడింది. అయితే, రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీల ప్రయోజనాలకు గండి పడకూడదనే ఉద్దేశంతో, ఈ చట్టాన్ని తాత్కాలికంగా జూలై 1, 2026 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో, ఈ నూతన చట్టాన్ని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని, రాబోయే పార్లమెంట్ సమావేశాలలోనూ దీనిపై గళమెత్తాలని కేబినెట్ వ్యూహాత్మక తీర్మానం చేసింది.
*విద్యాసంస్థలు, గిడ్డంగులకు భూముల కేటాయింపు
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, విద్యా విస్తరణకు కేబినెట్ పెద్దపీట వేసింది.
*దాన్యాల నిల్వ సామర్థ్యం పెంపు:
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (వేర్హౌసింగ్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో అత్యాధునిక గోదాముల నిర్మాణానికి గానూ వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 60 ఎకరాల భూమిని కేటాయించారు.
*కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు: మహబూబ్నగర్, సూర్యాపేట జిల్లాల్లో రెండు జవహర్ నవోదయ విద్యాలయాల స్థాపనకు, అలాగే జగిత్యాల జిల్లాలో ఒక కేంద్రీయ విద్యాలయం (కేంద్ర ప్రభుత్వ పాఠశాల) ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములను బదిలీ చేస్తూ కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
