
కరీంనగర్ :
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కేడర్లో నిరాశ నిస్పృహ అలుముకుందని, కేడర్ ను పట్టించుకునే నాయకుడు లేరని పేర్కొన్నారనీ ఆ కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, సర్పంచ్ అభ్యర్థి సోమినేని తిరుపతి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, దుకాణం బంద్ కాబోతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ కరువైందనీ, ప్రజలు పట్టించుకోవడంలేదని అందుకే నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఖాజీపూర్ సర్పంచ్ అభ్యర్థి తిరుపతి తన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలంతా పనిచేసే వారికి పట్టం కట్టాలని, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్బండ వర్గాల అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతున్నదని పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి తిరుపతి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు అవలంబిస్తున్న విధానాలు నచ్చక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరానని తిరుపతి పేర్కొన్నారు. వెలిచాల రాజేందర్రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు సర్పంచులు గా గెలవబోతున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టం కానుందని రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యున్నతికి పాటుపడతానని తిరుపతి తెలిపారు.