మహానగర పాలనలో 'విభజన' ముసురు!
- జీహెచ్ఎంసీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు..
- ఒకవైపు నిధుల గోల్మాల్, మరోవైపు బలవంతపు బదిలీలు
- సీపీఎస్ సొమ్ము ఏమైంది?
- 22 సంవత్సరాలుగా ఖాతాల్లో జమకాని వైనం.. మూడు కార్పొరేషన్ల విభజనపై సిబ్బంది ఆగ్రహం.. ప్రత్యేక అధికారికి 'భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (BMS)' వినతి
తెలంగాణ రాజధాని నగరం భాగ్యనగర పాలనలో పెను మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో, జీహెచ్ఎంసీ (GHMC) ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సీపీఎస్ (CPS) నిధులు వ్యక్తిగత ఖాతాల్లో కనిపించకపోవడం ఒకవైపైతే.. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియలో తమ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా 'బలవంతపు బదిలీలు' చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శనివారం భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ (BMS) ప్రతినిధులు, ఎం రాధాకృష్ణ, టి కృష్ణ, శ్రీధర్ గౌడ్ బృందం ప్రత్యేక అధికారిని కలిసి ఈ సమస్యలపై సుదీర్ఘ వినతిపత్రం సమర్పించారు.
జీతాల్లో కోత.. ఖాతాల్లో సున్నా!
2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెలా సీపీఎస్/ఎన్పీఎస్ కింద ప్రభుత్వం నిర్ణీత మొత్తాన్ని మినహాయిస్తోంది. అయితే, ఈ సొమ్ము ఉద్యోగుల వ్యక్తిగత ప్రాన్ (PRAN) ఖాతాల్లో మాత్రం ప్రతిబింబించడం లేదు. "జీతంలో కోత పడుతోంది కానీ, అది ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు కూడా జమ కావడం లేదు" అని యూనియన్ జనరల్ సెక్రటరీ టి. కృష్ణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం. రాధాకృష్ణ వాపోయారు. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత తమ పరిస్థితి ఏంటని సిబ్బంది గందరగోళంలో ఉన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన మినహాయింపులపై స్పష్టమైన, సరిచూసిన (Reconciled) స్టేట్మెంట్లను తక్షణమే అందజేయాలని వారు డిమాండ్ చేశారు.
అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం పేరుతో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) విడగొడుతున్న అధికారులు, ఉద్యోగుల స్థానికతను, నివాస ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీగా మారినప్పుడు అనుసరించిన ప్రజాస్వామ్య పద్ధతులను పక్కనబెట్టి, ప్రస్తుతం కొంతమంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని యూనియన్ మండిపడింది.
ప్రధాన అభ్యంతరాలు ఇవే:
కోర్టులో ఉండగానే హడావుడి: విభజనపై కోర్టులో పిల్ (PIL) విచారణలో ఉండగానే, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేయడంలో అధికారుల అంతర్యం ఏమిటని యూనియన్ సీనియర్ నాయకులు శ్రీధర్ ప్రశ్నించారు.
కీలకమైన యూనియన్లతో
చర్చించకుండా, కేవలం స్వచ్ఛ ఆటో సభ్యులతో సమావేశమై అంతా సవ్యంగా ఉందన్నట్లు అధికారులు చిత్రీకరించడంపై యూనియన్ వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి, నాయకులు భుజేందర్, గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20న జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకోకుండా కేవలం అటెండెన్స్ షీట్పై సంతకాలు తీసుకోవడమేంటని వారు నిలదీశారు.
యూనియన్ డిమాండ్లు:
స్థానికతకే పీఠం: ఉద్యోగులు నివసించే ప్రాంతం ఆధారంగానే వారిని ఆయా కార్పొరేషన్లకు కేటాయించాలి.
స్వచ్ఛంద బదిలీ: కొత్త కార్పొరేషన్లకు వెళ్లడానికి ఆసక్తి చూపే వారికే ప్రాధాన్యత ఇవ్వాలి.
సమ్మతి తప్పనిసరి: ఉద్యోగి సమ్మతి పత్రం (Consent) లేకుండా ఏకపక్షంగా బదిలీ చేయకూడదు.
ఈ సమస్యలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించకపోతే ఉధృతమైన ఉద్యోగ నిరసన తప్పదని యూనియన్ జనరల్ సెక్రటరీ టి. కృష్ణ హెచ్చరించారు. పారదర్శకమైన విభజన ప్రక్రియతో పాటు, తమ సీపీఎస్ నిధులకు భద్రత కల్పించాలని మహానగర కార్మికులు, అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
.jpeg)
.jpeg)

