బల్దియా ఖజానాకు 100ల కోట్ల అవినీతి గండి...!
- సరూర్ నగర్, ఎల్బీనగర్ జోన్లలో పన్నుల మాయాజాలం
- రికార్డుల్లో వేల చదరపు అడుగుల విస్తీర్ణం 'గాయబ్'
- సామాన్యుడిపై నోటీసుల ప్రతాపం.. బడా వ్యాపారుల వద్ద అధికారుల 'మామూళ్ల' మత్తు
- ఏటా వందల కోట్ల ఆదాయానికి గండి.. ఏసీబీ, విజిలెన్స్ నిమ్మకు నీరెత్తినట్లేనా?
- ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ అవినీతికి పాల్పడిన డిప్యూటీ కమిషనర్లను వదిలేసి చిన్న స్థాయి ఉద్యోగులపై ఎందుకు ప్రతాపం చూస్తున్నారు.
- మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..
జీహెచ్ఎంసీ (GHMC) ఖజానాకు రక్షణగా ఉండాల్సిన అధికారులే *'అవినీతి తిమింగలాలు'*గా మారి ప్రభుత్వ ఆదాయానికి కన్నం వేస్తున్నారు. సరూర్ నగర్, ఎల్బీనగర్ జోన్లలో సామాన్యుడి చిన్నపాటి నిర్మాణాలపై డ్రోన్లతో నిఘా పెట్టి వేధించే అధికారులు, బడా వ్యాపారుల వద్దకు వచ్చేసరికి 'మామూళ్ల' మత్తులో జోగుతున్నారు. వేల చదరపు అడుగుల వాణిజ్య విస్తీర్ణాన్ని రికార్డుల్లో మాయం చేస్తూ, కమర్షియల్ భవనాలను రెసిడెన్షియల్గా చూపిస్తూ ఏటా ₹100 కోట్లకు పైగా గండి కొడుతున్నారు. ఉన్నతాధికారుల లాగిన్ల ద్వారానే అక్రమంగా పెనాల్టీలు మాఫీ చేస్తూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. సాక్షాత్తూ సీఎం ఇలాకాలో జరుగుతున్న ఈ 'పన్ను'గడపై ఏసీబీ, విజిలెన్స్ ఎప్పుడు ఉక్కుపాదం మోపుతాయో వేచి చూడాలి.
హైదరాబాద్:
ప్రభుత్వ ఆదాయానికి రక్షణ కవచంలా ఉండాల్సిన అధికారులే భక్షకులుగా మారారు. నిబంధనలను తుంగలో తొక్కి, బడా వ్యాపారులతో అపవిత్ర కలయిక సాగించి జీహెచ్ఎంసీ (GHMC) ఖజానాకు కన్నం వేస్తున్నారు. సామాన్యుడు తన అవసరం కోసం ఒక చిన్న గది నిర్మించుకుంటే చాలు.. డ్రోన్ కెమెరాలతో నిఘా వేసి, నోటీసులతో ఉక్కిరిబిక్కిరి చేసే బల్దియా యంత్రాంగం, కోట్లాది రూపాయల పన్ను ఎగవేస్తున్న అక్రమార్కుల ముందు మాత్రం మోకరిల్లుతోంది. ముఖ్యంగా సరూర్ నగర్ సర్కిల్ కేంద్రంగా సాగుతున్న ఈ 'పన్ను'గడ అక్షరాలా ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తోంది.
దిల్సుఖ్నగర్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల విస్తీర్ణాన్ని రికార్డుల్లో మాయం చేయడం ద్వారా అధికారుల 'వసూళ్ల' పర్వం సాగుతోంది. పరిశోధనలో తేలిన కొన్ని దిగ్భ్రాంతికర అంశాలు ఇవే:
1. సాయిబాబా ఆలయ సముదాయం (డోర్ నెం: 13-9-46/1/NR నుండి 13-9-48/20/NR):
ఇక్కడ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ + 2 అంతస్తుల్లో కలిపి సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా, రికార్డుల్లో మాత్రం కేవలం 18,859 చ.అ. మాత్రమే చూపిస్తున్నారు. అంటే సుమారు 11,141 చదరపు అడుగుల విస్తీర్ణానికి అసలు పన్నే కట్టకుండా ఏళ్ల తరబడి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, అధికారుల అంతర్గత ఒప్పందమేనని స్పష్టమవుతోంది.
ఈ భవనానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ (టిన్: TR-0802-045-0002) ప్రకారం విస్తీర్ణం 17,817 చ.అ. ఉండగా, ఆస్తి పన్ను (పిటిన్: 1031300934) రికార్డుల్లో మాత్రం కేవలం 8,857 చ.అ. మాత్రమే ఉంది. దాదాపు 9,080 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పన్ను పరిధి నుంచి తప్పించడం ద్వారా ఏడాదికి సుమారు 12 లక్షల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది.
శాస్త్రీయ ఆధారాలు: ట్రేడ్ వర్సెస్ ప్రాపర్టీ టాక్స్
అక్రమార్కులు పన్ను తప్పించుకోవడానికి అనుసరిస్తున్న శాస్త్రీయ విధానాలను అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
రోడ్డు వెడల్పు మాయాజాలం: డబుల్ రోడ్డుపై ఉన్న భవనాలను సింగిల్ రోడ్డుగా చూపించి పన్ను రేటు (Slab Rate) తగ్గిస్తున్నారు.
యూసేజ్ కన్వర్షన్: పూర్తిస్థాయిలో కమర్షియల్ ఉపయోగిస్తున్న భవనాలను 'రెసిడెన్షియల్'గా చూపించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
పెనాల్టీల మాఫీ: నిబంధనల ప్రకారం వేయాల్సిన 100% జరిమానాలను అధికారుల లాగిన్ల ద్వారా అక్రమంగా తొలగిస్తున్నారు..jpeg)
హద్దులు దాటిన అక్రమ 'లాగిన్లు':
సరూర్ నగర్ సర్కిల్ అధికారులు తమ పరిధి దాటి హయత్ నగర్ సర్కిల్ లోని ఆస్తులకు కూడా అక్రమంగా అసెస్మెంట్ చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి.
మన్సూరాబాద్లోని ఓ భవనానికి (నెం: 3-8-439/1) నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఒక గంటలోనే అసెస్మెంట్ పూర్తి చేయడం వ్యవస్థలోని లోపాలకు నిలువుటద్దం. డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, ఏఎంసీ శ్రీనివాసరావుల లాగిన్ల నుంచే ఈ పనులు పూర్తయినా, తమకు తెలియదని బుకాయించడం గమనార్హం.
ప్రభుత్వానికి సవాల్గా మారిన అవినీతి
తెలంగాణ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న తరుణంలో, జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఇలాంటి పన్ను చోరీలు శాపంగా మారాయి. ఎల్బీనగర్ జోన్ లోని నాలుగు సర్కిళ్లలో (సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్) జరుగుతున్న ఈ స్కామ్ విలువ ఏడాదికి 100 కోట్ల పైచిలుకే అని అంచనా.
ప్రశ్నలివే.. సమాధానం ఎక్కడ?
ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
చిన్న స్థాయి ఉద్యోగులను కాకుండా ఎ.ఏంసి, డి.సి లను సస్పెండ్ చేయాలి..!
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చర్యలు ఎక్కడ..?
విజిలెన్స్ మరియు ఏసీబీ అధికారులు ఈ 'వసూల్ రాజా'లపై ఎప్పుడు ఉక్కుపాదం మోపుతారు?
మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అక్రమార్కుల చిట్టాపై విచారణకు ఆదేశిస్తారా?
వ్యవస్థలో పేరుకుపోయిన ఈ అవినీతి తిమింగలాలపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే, నిజాయితీగా పన్ను చెల్లించే సామాన్యుడికి ప్రభుత్వంపై నమ్మకం పోవడం ఖాయం.
