ఆరోగ్య మిత్రల దశాబ్దాల కల సాకారం

  • ​'డీఈఓ' హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ​మంత్రి దామోదర రాజనర్సింహ, సీఈఓ ఉదయ్‌కుమార్‌కు ఉద్యోగుల కృతజ్ఞతలు

ఆరోగ్య మిత్రల దశాబ్దాల కల సాకారం

​హైదరాబాద్:

ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2007 నుంచి విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రలకు 'డాటా ఎంట్రీ ఆపరేటర్' (డీఈఓ) హోదాను కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

​మంత్రులకు, అధికారులకు ఘన సన్మానం

​తమ దశాబ్దాల విన్నపాన్ని మన్నించి హోదా కల్పించినందుకు గాను ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ పి. ఉదయ్ కుమార్ (IAS), ట్రస్ట్ ఈ.ఓ రమేష్, జనరల్ మేనేజర్ నరేష్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

​పెండింగ్ సమస్యలపై వినతి:

​ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు సీఈఓకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. భవిష్యత్తులో ఆరోగ్య మిత్రలందరినీ పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి ప్రయాణ, కరువు భత్యాలు (T.A, D.A) కల్పించాలని కోరారు. దీనిపై సీఈఓ సానుకూలంగా స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
 ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య, ఉపాధ్యక్షుడు సుమన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కిషోర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రత్నం, నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తమకు గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా గిరి యాదయ్య పేర్కొన్నారు.

About The Author