మహిళా సాధికారతతోనే సమాజ వికాసం: నవజీవన్ రెడ్డి
మహిళల సాధికారతతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాగోల్లోని నిమంత్రాన్ ప్యాలెస్లో మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, చింతల అరుణా సురేందర్ యాదవ్లతో కలిసి మహిళలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు కుటుంబానికే కాకుండా సమాజానికి బలమైన ఆధారస్తంభాలని కొనియాడారు. వారి విద్య, ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి రంగంలో మహిళలు తమదైన ముద్ర వేయడం గర్వకారణమని పేర్కొన్నారు.
మాజీ కార్పొరేటర్ కు గజమాలతో సత్కారం
అనంతరం హయత్ నగర్ డివిజన్ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ ఎంక్లేవ్ ఫేస్-1 కాలనీవాసులు నవజీవన్ రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. తమ కాలనీలో సి.సి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల వంటి మౌలిక వసతుల కల్పనలో ఆయన చూపిన చొరవకు కృతజ్ఞతగా ఈ సన్మానం చేసినట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు.
ప్రజల ఆశీస్సులు, ప్రేమాభిమానాలే తనకు బలమని, కాలనీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నగేష్, ప్రతినిధులు వెంకటేష్, రాజు, రవి, నర్సింగ్ రావు, జంగయ్య, రెడమ్మ తదితరులు పాల్గొన్నారు.
