మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?
- మీ వైఫల్యాలను ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారా?
- మీ నాటకాలను జర్నలిస్టులు గమనిస్తూనే ఉన్నారు...
- డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

కరీంనగర్ :
తమ అసమర్ధతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొందరు జర్నలిస్టుల సమస్యలపై భారీ ధర్నా పేరుతో కొత్త నాటకాలకు తెరతీసారని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ ఆరోపించారు. వాస్తవానికి ఈ నాయకుల కారణంగానే రాష్ట్రంలోని మెజారిటీ జర్నలిస్టులు ప్రభుత్వానికి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ప్రభుత్వానికి మధ్య అగాథం పెంచి ప్రస్తుతం దానిని తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
సమాచార శాఖ వైఫల్యం చెందిందని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు
మాట్లాడడం, ప్రభుత్వ చలువతో అధికారంలోకి ఉండి అదే ప్రభుత్వం పై ధర్నాలకు ప్రోత్సహించడం కన్న విడ్డూరం
మరొకటి ఉండబోదన్నారు. మీడియా అకాడమీ నిర్దిష్టమైన లక్ష్యాలతో ఏర్పడిందని, దానికి చైర్మన్ గా నియమించే వ్యక్తులకు
ఆ బాధ్యతలు కాకుండా సమాచార శాఖ నిర్వహించే బాధ్యతలు కూడా అప్పగించడం ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన అన్నారు.. ఇకపై మీడియా అకాడమీకి నియమించే వ్యక్తులను కేవలం అకాడమీ పనులకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాహితం కోసం ప్రభుత్వం చేస్తున్న పనులకు తెలంగాణ జర్నలిస్టుల మద్దతు కూడ కట్టడంలో వైఫల్యం చెందిన కొందరు నాయకులు ఒకటి రెండు నెలల్లో ముగియబోతున్న తమ పదవులు కాపాడుకునేందుకు కొత్త వేషాలతో ముందుకు వస్తున్న విషయాన్ని రాష్ట్రంలోని జర్నలిస్టులు గమనించాలన్నారు. అలాంటి వ్యక్తులు జర్నలిస్టు సంఘాల కంటే, డ్రామా కంపెనీలు నడుపుకుంటే బాగుంటుందని సూచించారు.
ఈ సమావేశంలో డబ్ల్యుజేఐ జిల్లా అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మొగురం రమేష్, కోశాధికారి చిటుమల్ల మహేందర్ పాల్గొన్నారు.
