'సూపర్ సిక్స్' పథకాలలో ఒకటైన 'స్త్రీ శక్తి' పథకం అమలు
తిరుపతి జిల్లా ప్రతి నిధి, ఆగష్టు 16(భారత శక్తి):
రాష్ట్ర ప్రభుత్వం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు, ట్రాన్స్జెండర్లకు గొప్ప బహుమతిని అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'సూపర్ సిక్స్' పథకాలలో ముఖ్యమైన ' స్త్రీ శక్తి' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన 'స్త్రీ శక్తి' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండలంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా పల్లె వెలుగు బస్సు స్టీరింగ్ పట్టి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ బస్సులను నారావారిపల్లె, అప్పలాయగుంట, బాకరాపేట మీదుగా యర్రావారిపాలెం వద్ద గల ఓ.ఎస్. గొల్లపల్లి, పాకాలకు మొత్తం 6 బస్సులుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి, మహిళా నాయకురాలు పులివర్తి సుధారెడ్డి కూడా పాల్గొన్నారు. ఆమె మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి, వారికి ఉచిత జీరో ఫేర్ టికెట్లు అందజేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఈ ప్రయాణంలో వారు మహిళలతో మాట్లాడి వారి సమస్యలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల పక్షపాతి అని, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పథకం రోజువారీ కూలీ పనులు, వ్యాపారాలకు వెళ్లే మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని, వారికి ఒక గొప్ప ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి సుమారు 1942 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని ఆయన తెలిపారు. గత పాలనలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటినీ సమానంగా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గ మహిళల తరఫున కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి వెన్నంటి నిలబడి సహాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
