శత్రువుకు దొరికినా తలవంచని వీరవనిత కామ్రేడ్ భాగ్యక్కకు కన్నీటి నివాళి
ప్రజా గాయకురాలు విమలక్క
దుబ్బాక:
ఇరవై నాలుగేళ్ల అజ్ఞాతవాసం… చిన్ననాటి పోలియోతో పోరాటం… చివరకు ఛత్తీస్గఢ్ అడవుల్లో తుపాకీ తూటాకు బలైన ధీర వనిత కామ్రేడ్ రంగబోయిన భాగ్య అలియాస్ రూపి సంస్మరణ సభ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో భావోద్వేగ భరితంగా జరిగింది.ప్రజా గాయకురాలు విమలక్క పాల్గొన్న ఈ సభకు ప్రజా సంఘాల నాయకులు, వందలాది మంది హాజరై ఎర్రజెండాల మధ్య నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, “ఇది కేవలం సంస్మరణ సభ కాదు… ఒక పోరాట జీవితానికి ఇచ్చిన గౌరవ వందనం” అని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన భాగ్యక్క జీవితాన్ని స్మరించుకుంటూ ఆమె ధైర్యసాహసాలను గుర్తుచేశారు.అనంతరం
విమలక్క మాట్లాడుతూ.. “శత్రువుకు చిక్కినా లొంగిపోకుండా చివరి శ్వాస వరకు నమ్మిన మార్గంలో నడిచిన ధీర వనిత భాగ్యక్క” అని కొనియాడారు. ఆమె పోరాట జీవితం, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
బడుగు, బలహీన వర్గాల కోసం అడవి బాట పట్టిన భాగ్య జీవితం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో భాగ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కామ్రేడ్ భాగ్యక్క పాటల సీడీని ఆవిష్కరించారు.
పోలియోను జయించి, 24 సంవత్సరాలు అజ్ఞాతంలో జీవించి, చివరి వరకు తన సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన భాగ్య జీవిత గాథ సభలో పాల్గొన్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.
.jpeg)
