ఓటరు మ్యాపింగ్కు ‘హెల్ప్ డెస్క్’లు ప్రారంభం
హైకోర్టులో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు
హైదరాబాద్:
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు, ఓటర్లకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) ఆర్.వి.కర్ణన్ ఆదేశాల మేరకు.. అన్ని వర్గాల ఓటర్ల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో ‘హెల్ప్ డెస్క్’లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద 2002–2025 ఓటర్ల మ్యాపింగ్ కోసం ప్రత్యేక కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.
*మ్యాపింగ్ చేసుకున్న న్యాయవాదులు*
అదనపు కమిషనర్ (ఎన్నికలు) కె.చంద్రకళ, చార్మినార్ ఈఆర్ఓ సరిత ఈ హెల్ప్ డెస్క్ను ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా పలువురు న్యాయవాదులు తమ ఓటు వివరాలను సులభంగా మ్యాపింగ్ చేసుకున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సహకరించారు.
*అన్ని సంఘాల్లోనూ కేంద్రాలు*
మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగర పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్లలోనూ ఇలాంటి హెల్ప్ డెస్క్లను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
