ఎల్.బి. నగర్ నియోజకవర్గ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న జీ.హెచ్.ఎం.సి. సర్కిల్..
- అడ్డగోలుగా దోచుకుంటున్న అవినీతి అధికారులు..
- పన్నులు కడుతున్న ప్రజలకు తప్పని ఇక్కట్లు..
- ఎల్.బీ. నగర్ లో అవినీతి అనేది ఒక వ్యవస్థగా మారింది..
- న్యాయం అనే పదాన్ని తొలగించి లంచం అనే పదాన్ని చేర్చిన దుర్మార్గం..
- అది చిన్న అనుమతి అయినా సరే పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే..
- సాధారణ పౌరుడు ఒక గుంట స్థలం కొనాలన్నా.. ఒక్క రూం నిర్మించాలన్నా..
- అనుమతులకోసం పడిగాపులు పడాల్సిందే.. కంట తడి ఎండిపోవాల్సిందే..
- విచిత్రం ఏమిటంటే అక్రమ నిర్మాణాలకు మాత్రం క్షణాల్లో అనుమతులు దొరికిపోతాయ్..
- క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని, కమిషనర్ స్థాయి వరకు అందరూ లంచావతారాలే..
- ఎన్ని కథనాలు రాసినా.. ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం..
- రైట్ టు ఇన్ ఫార్మేషన్ కింద వివరాలు అడిగితే విసుక్కోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదు..
- అసలు ఎల్.బీ. నగర్ నియోజకవర్గంలో జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ పనిచేస్తోందా..?
- జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఓసారి ఇక్కడ పరిస్థితులపై ఓ లుక్ వెయ్యాలి..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఈ విషయంపై ఆలోచించాలి..
- ఎల్.బీ. నగర్ ప్రజలను కాపాడేందుకు నడుం కట్టింది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "...

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ ) :
ప్రభుత్వం అవినీతిని నిరోధిస్తామని గొప్ప గొప్ప నినాదాలు ఇస్తున్నా.. గ్రౌండ్ రియాలిటీ అంటే వాస్తవిక పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అధికారులు ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు. అవినీతిపై మాట్లాడే ప్రజలకు మౌనం మాత్రమే మిగిలిపోతోంది.
ఇక ఎల్.బీ. నగర్ జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ లో ఈ దోపిడీని ఆపకపోతే ప్రజల విశ్వాసం పూర్తిగా చచ్చిపోతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన. కానీ ఇక్కడ ప్రజల మీదే అవినీతి పాలన జరుగుతోంది. ప్రభుత్వం, విజిలెన్స్ విభాగం తక్షణం జోక్యం చేసుకొని, ఈ అవినీతి వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో “ఎల్.బి. నగర్ సర్కిల్” అనే పేరు అవినీతికి చిహ్నంగా మారిపోతుంది.
ఎల్.బి. నగర్ జీ.హెచ్.ఎం.సి. సర్కిల్లో అవినీతి తాండవం చేస్తోంది అన్నది నిర్విదాంశం.. నానాటికి ఈ నియోజక వర్గ ప్రజల విశ్వాసాలు తల్లకిందులై సన్నగిల్లిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.. మరీ ఈ మధ్య కాలంలో ప్రజల నోళ్లలో ఒకే మాట వినిపిస్తోంది.. "అధికారుల దోపిడీ ఎక్కడ చూసినా విస్తరిస్తోంది". నగరాభివృద్ధి పేరుతో ప్రతి పని వెనక అవినీతి వాసన వస్తోంది.
ప్రతి ఫైల్, ప్రతి అనుమతి, ప్రతి పాస్... అధికారుల “కమీషన్ కోటా” లేకుండా కదలడం అసాధ్యం అనేది ఇక్కడ నెలకొని ఉంది.
ఇక్కడ సాధారణ పౌరుడు తన ఇల్లు నిర్మించుకోవాలన్నా, చిన్న వ్యాపారం మొదలుపెట్టాలన్నా, ఒక ప్లాన్ అప్రూవల్ కోసం ఫైల్ పెట్టినా అధికారుల చేతుల్లో లంచం పడకుంటే ఆ ఫైల్ అధికారుల కంటికి కనిపించదు.. ఒకవేల ఏ దరఖాస్తుదారుడైనా గట్టిగా అడిగితే ఫైల్ “మిస్సింగ్” అనే సమాధానం వస్తుంది.. ఫిర్యాదు చేస్తే “వేరే విభాగానికి పంపాం” అని తప్పించుకోవడం ఇక్కడ పరిపాటి అయిపొయింది..
పాత ఇళ్ల రీజిస్ట్రేషన్, హౌస్ ట్యాక్స్ సవరణలు, నల్లా కనెక్షన్, రోడ్డు రిపేర్.. ఈ విధంగా ప్రతి చిన్న పనికి పెద్ద కమీషన్ కోరుతున్నారు. అదికూడా బహిరంగంగానే జరుగుతోంది..
మరి ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
ఎల్.బి. నగర్ జీ.హెచ్.ఎం.సి. సర్కిల్లో అవినీతి వ్యవస్థపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ, ఉన్నతాధికారులు మాత్రం ఏదో కారణాలతో మౌనం వహిస్తున్నారు. వారి కళ్ళముందే సర్కిల్ లో అవినీతి బలపడుతోంది.. ప్రజల న్యాయబద్ధమైన సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నా, ఎవరూ స్పందించడం లేదు. “తప్పు చేసిన వారిని కాపాడటం, నిజం చెప్పిన వారిని వేధించడం” అనే విధానం అక్కడ సర్వసాధారణం అయిపోయింది.
ప్రజలు అవినీతికి అడ్డంగా బలవుతున్న దుస్థితి :
నగరాభివృద్ధి పేరుతో భూములు ఆక్రమించబడుతున్నాయి, డ్రెయినేజీ పనులు అర్ధంతరంగా వదిలేస్తున్నారు, కాంట్రాక్టులు “పర్సనల్ లింక్స్” ఆధారంగా ఇస్తున్నారు. ప్రజలు ఫిర్యాదు చేయాలంటే భయపడుతున్నారు.. ఎందుకంటే ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ల పనులు మరింత ఆలస్యం అవుతాయనే భయం ఉంది. ఈ పరిస్థితుల్లో న్యాయం కోరడం ప్రజలకే ప్రమాదంగా మారిపోయింది.
ప్రభుత్వం ఎక్కడ? ఏమి చేస్తోంది..?
ప్రతి ఎన్నికల ముందు “అవినీతి రహిత పాలన” అని గొంతు చించుకున్న ప్రభుత్వం.. ఇలాంటి సర్కిల్లలో జరుగుతున్న దోపిడీపై మాత్రం కళ్ళు మూసుకుంటోంది.. నోరుమెదపడం లేదు.. మరీ విచిత్రం ఏమిటంటే విజిలెన్స్ విభాగం, అవినీతి నిరోధక బ్యూరో వంటి సంస్థలు కేవలం కాగితాల మీదే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రజలు న్యాయం కోసం తలుపులు తట్టి తిరుగుతుంటే, అధికారులు లంచపు నోట్లతో రాజ్యం చేస్తున్నారు.
ఇంకా మౌనం వహించడం సరికాదు :
ఎల్.బి. నగర్ సర్కిల్ పరిస్థితి ఒక ఉదాహరణ మాత్రమే.. ఇక ఈ అవినీతి వ్యవస్థను చీల్చి, ప్రజల న్యాయాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన అధికారులపై సస్పెన్షన్లు, దర్యాప్తులు, విజిలెన్స్ విచారణలు వెంటనే జరగాలి. అంతేకాదు పౌరులు కూడా మౌనం వీడి ప్రశ్నించడం నేర్చుకోవాలి.. న్యాయం జరిగేవరకూ నిలబడాలి.
ఎందుకంటే “ప్రజాస్వామ్యంలో ప్రజలే బలహీనమైతే, అవినీతి బలపడుతుంది.”
ఎల్.బి. నగర్ ప్రజల కోసం న్యాయం సాధించాలంటే, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది.. అంతే కాకుండా ఈ సర్కిల్ లో జరిగిన అవినీతి వ్యవహారాలు ఒకటి కాదు రెండు కాదు.. కోకొల్లలు.. వాటన్నింటినీ సాక్షాధారాలతో సహా వెలుగులోకి వరుస కథనాల ద్వారా తీసుకుని రానుంది.. " భారత శక్తి " సహకారంతో " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
