
కరీంనగర్ :
ఈనెల 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాతవాహన యూనివర్సిటీ స్నాత్సకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, నగర పాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, పోలీసు, వైద్య, విద్యుత్ శాఖ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్ పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు కార్యక్రమాలకు సమయపాలన పాటించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను మెడికల్ టీం, 108,104 ,ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, అలాగే డయాస్ ఇతర ఏర్పాట్లు ఆర్అండ్ బీ అధికారులు చూడాలని , తాగునీరు, శానిటేషన్, ఫాగింగ్ వంటి ఏర్పాట్లు చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసే స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి పలు సూచనలు చేశారు.యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందని, ఐడెంటిటీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోని కి అనుమతి ఇస్తామని, గేటు వద్ద తనిఖీ కోసం యూనివర్సిటీ తరఫున సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యే వారి పేర్ల జాబితాను ముందే సమర్పించాలన్నారు. యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడారు
ఈనెల 7న ఉదయం శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొంటారన్నారు. ఉదయం 10 గంటల వరకు చేరుకుంటారన్నారు. అలాగే అతిథి ప్రొఫెసర్ బీ.జే రావు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గోల్డ్ మెడల్, పీహెచ్ డీ పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నారు. పలు కార్యక్రమాల అనంతరం సెమినార్ హాల్ ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమం సవ్యంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.ఈ సమావేశంలో డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డిసిపి వెంకటరామిరెడ్డి, ఏసీపీలు పోలీసు, వైద్య, విద్య , రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.