మహిళలు ఆర్థికంగా ఎదగాలి... ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.
రూ.35 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అండతో మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలని హైదరాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్లో జీహెచ్ఎంసీ పరిధిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
99 రోజుల ప్రణాళికతో ప్రగతి పథం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వార్డులు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకే ఈ 99 రోజుల కార్యాచరణను రూపొందించినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణలో మహిళలు చురుగ్గా భాగస్వాములు కావాలని కోరారు.
ఆకర్షణీయంగా ‘అద్దాల లైబ్రరీ’.. బాధ్యతగా ‘ఈ-వేస్ట్’ సేకరణ
ఇందిరా మహిళా శక్తితో ఉపాధి:
నూతన పథకం: నగరంలోని మహిళా సంఘాలు ముందుకు వస్తే.. ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులను చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
సంక్షేమ ఫలాలు: ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు మహిళల అభ్యున్నతికేనని పేర్కొన్నారు. సెట్విన్ ద్వారా శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ వంటివి మరింత వేగవంతం చేస్తామన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘ఇందిరమ్మ చీరలు’
ఈ కార్యక్రమానికి మహిళలందరూ ఇందిరమ్మ చీరలు ధరించి భారీ సంఖ్యలో తరలిరావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె. ఉపేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
