మోదీ సభను విజయవంతం చేయండి: సామ రంగారెడ్డి.
- కాలనీల్లో ముమ్మరంగా ఆహ్వాన పత్రికల పంపిణీ
- పరేడ్ గ్రౌండ్స్ సభకు తరలిరావాలని పిలుపు
ఎల్బీనగర్:
భారత శక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న 'జనాగ్రహ సభ'ను విజయవంతం చేయాలని బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జ్, మేడ్చల్ రూరల్ జిల్లా ప్రభారీ సామ రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆయన విస్తృతంగా పర్యటించి, కాలనీ వాసులకు స్వయంగా ఆహ్వాన పత్రికలను అందజేశారు.
వాకర్స్ అసోసియేషన్లతో భేటీ
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద పార్కులో మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామ రంగారెడ్డి పాల్గొన్నారు. పార్కుకు వచ్చిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి, సభకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. దేశాభివృద్ధిలో మోదీ చేపట్టిన పథకాలను వివరిస్తూ, భారీ సంఖ్యలో ప్రజలు సభకు తరలిరావాలని కోరారు.
అనంతరం నాగోల్ డివిజన్ రాక్ టౌన్ కాలనీ పార్కులో మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సామ రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాలనీ వాసులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తూ.. మే 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే జనాగ్రహ సభకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
సమరశంఖం పూరిద్దాం..*
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ ఈ ఆహ్వానం అందేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
