పారదర్శకతతో సంక్షేమ పథకాల అమలు.. అభివృద్ధి, సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- 226 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల 26 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.
- పాల్గొన్న అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
పటాన్చెరు:
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. రామచంద్రాపురం, పటాన్చెరు మరియు అమీన్పూర్ రెవెన్యూ మండలాల పరిధిలోని 226 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఎమ్మెల్యే గారితో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ముఖ్యంగా అమీన్పూర్ పరిధిలోని 57 మంది లబ్ధిదారులకు ఈ పథకాల కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ముఖ్య నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
