పంటల కొనుగోళ్లు పకడ్బందీగా సాగాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
జిల్లాలో పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంటల కొనుగోలు ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వరి, సోయా, పత్తి, మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించి కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 14,760.56 క్వింటాళ్ల వరి ధాన్యం, 5,746 క్వింటాళ్ల సోయా, 7,715 క్వింటాళ్ల మొక్కజొన్న, 66,140 క్వింటాళ్ల పత్తి పంటను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. తగు తేమ శాతం వచ్చిన తరువాతే రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తుందని తెలిపారు. 7 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చిన రైతులు తమ వివరాలను మండల వ్యవసాయ అధికారుల ద్వారా నమోదు చేయించి, పంట ఉత్పత్తి పరిశీలన చేపట్టించుకోవాలన్నారు. ఆ వివరాలను కొనుగోలు కేంద్రాలకు అధికారులు అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో
మొత్తం 351 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యానికి వంద శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తిచేయాలని, ప్రతీ కేంద్రంలో ప్యాడి క్లీనర్లను ఉపయోగించాలని సూచించారు. కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంటల కొనుగోలులో రైతులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. పత్తి రైతుల సౌకర్యార్థం 1800 599 5779 టోల్ ఫ్రీ నెంబరు, 88972 81111 వాట్సాప్ నెంబర్లు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ సుధాకర్, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, మార్కెటింగ్ అధికారి గజానంద్తో పాటు సిసిఐ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
