
వేములవాడ :
రోడ్డు పై వాహనాలు నడిపే డ్రైవర్లకు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి అన్నారు. వేములవాడలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు,వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు గురువారం పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో హెవీ వెకిల్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన నియమలపై దిశ నిర్దేశం చేశారు.ఈసందర్భంగా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరిస్తు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు నివారించాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, కండిషన్ లో లేని వాహనాలు నడపటం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్,మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ లోడ్,రాంగ్ రూట్లో ప్రయాణించడం,కండిషన్ లో లేనటువంటి వాహనాలు నడపటం లాంటి తప్పిదాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు దూర ప్రయాణం చేసే సందర్భల్లో సరైన విశ్రాంతి తీసుకోవాలని దీని వల్ల ప్రమాదాలు నివారించవచ్చని,ప్రతి వాహనదారుడు వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి.పరిమితికి లోబడి వాహనాలు లోడ్ చేసుకోవాలని, మద్యం సేవించి,సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.డ్రైవింగ్ అనేది వృత్తి మాత్రమే కాదని, అది అనేకమంది కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉందని గుర్తు చేశారు.అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రత నియమాలను పాటించాలనే ప్రతిజ్ఞ చేశారు. ఈసమావేశంలో పట్టణ సీఐ వీరప్రసాద్, ఎస్.ఐ లు రామ్మోహన్, రాజు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.