ఆక్రమణదారుల గుప్పిట నుంచి పార్కు స్థలం విముక్తి..!
జొన్నబండలో రంగంలోకి దిగిన హైడ్రా 1444 గజాల స్థలానికి రక్షణగా ఫెన్సింగ్
హైదరాబాద్:
ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల చెర నుంచి హైడ్రా (HYDRAA) విముక్తి చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ పరిధిలోని జొన్నబండలో గురువారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. విలువైన ప్రభుత్వ భూమికి రక్షణ కవచం ఏర్పాటు చేశారు.
ప్రజావాణిలో ఫిర్యాదు.. వెనువెంటనే చర్యలు
జొన్నబండలోని ఎంహెచ్ఆర్ కాలనీ లేఅవుట్ ప్రకారం.. సర్వే నంబర్లు 575, 576 (పార్ట్), 577, 578 (పార్ట్), 598, 580 (పార్ట్)లలో మొత్తం 1444.40 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. అయితే, ఈ స్థలంపై కొందరు కన్నేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాలనీవాసులు ఇటీవల హైడ్రా 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి అధికారుల బృందం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. రెవెన్యూ రికార్డులు, లేఅవుట్ ప్లాన్లను నిశితంగా పరిశీలించి, సదరు స్థలం పార్కుకే చెందుతుందని నిర్ధారించుకుంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సిబ్బందితో కలిసి పార్కు చుట్టూ ఇనుప ఫెన్సింగ్ను ఏర్పాటు చేసి బోర్డులను పాతారు.
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
కాలనీకి ఊపిరితిత్తుల్లాంటి పార్కు స్థలాన్ని కాపాడటంపై ఎంహెచ్ఆర్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తీసుకున్న సత్వర చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్థలంలో ఇకపై ఎవరూ చెత్త వేయకుండా చూడాలని, తక్షణమే దీనిని పార్కుగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరుతామని స్థానికులు పేర్కొన్నారు.
