తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్గా పి. రాకేష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
- తాండూరును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- గ్రూప్ వన్ సెలెక్ట్ అయి మొదటి పోస్ట్
- కమిషనర్కు స్వాగతం పలికిన మున్సిపల్ అధికారులు
వికారాబాద్:
తాండూరు మున్సిపల్ కమిషనర్గా పి. రాకేష్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ కమిషనర్గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి బదిలీపై సైబరాబాద్ కార్పొరేషన్కు వెళ్లగా, ఆయన స్థానంలో గ్రూప్-1లో ఎంపికై పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న పాల్వాయి రాకేష్ రెడ్డిని ప్రభుత్వం తాండూరు మున్సిపల్ కమిషనర్గా నియమించింది.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పట్టణ పారిశుధ్య వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం, మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే పట్టణ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ల సహకారం ఎంతో అవసరమని, వారి సూచనలను స్వాగతిస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డిని కమిషనర్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పట్టణ అభివృద్ధి అంశాలపై చర్చించారు.
మరోవైపు కొత్త కమిషనర్కు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వార్డు ఆఫీసర్లు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. నూతన కమిషనర్ నాయకత్వంలో తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.
