శ్వాస ఆడక విలవిల్లాడిన మూడు రోజుల నవజాత శిశువు..
- 108 సిబ్బంది సిపిఆర్తో ప్రాణరక్షణ
- మార్గమధ్యంలో అత్యవసర చికిత్స అందించిన ఈఎంటి శాంత్ కుమార్, పైలట్ అయుబ్ పాషా
- తాండూర్ నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తరలిస్తుండగా చోటుచేసుకున్న ఘటన
- చిన్నారి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిపై ప్రశంసల వెల్లువ
వికారాబాద్:
వికారాబాద్ జిల్లా తాండూర్లో మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. శ్వాస సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురైన మూడు రోజుల నవజాత శిశువుకు 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాలకెళితే..
కొడంగల్ నియోజకవర్గంలోని తుంకిమెట్ల గ్రామానికి చెందిన భువనేశ్వరి మూడు రోజుల క్రితం తాండూర్ మాతా శిశు ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువుకు నిన్నటి నుంచి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో చిన్నారిని హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో బాబుకు ఒక్కసారిగా శ్వాస ఆడక పరిస్థితి విషమించింది. వెంటనే అప్రమత్తమైన 108 ఈఎంటి శాంత్ కుమార్, పైలట్ అయుబ్ పాషా సమయస్ఫూర్తితో స్పందించి చిన్నారికి సిపిఆర్ నిర్వహించారు. వారి తక్షణ చర్యలతో బాబు తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
అనంతరం బాబునీ సురక్షితంగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చేర్పించారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన 108 సిబ్బందికి చిన్నారి తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాబునీ ప్రాణాలను కాపాడిన ఈఎంటి శాంత్ కుమార్, పైలట్ అయుబ్ పాషాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది చూపిన సేవాభావం, సమయస్ఫూర్తి మరోసారి ప్రాణరక్షకులుగా వారి పాత్రను చాటిచెప్పింది.
