విజయవంతంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలు
ప్రజా సమస్యలపై పోరాటమే వ్యవసాయ కార్మిక సంఘం లక్ష్యం
వికారాబాద్:
వ్యవసాయ కార్మిక సంఘం ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని, సమాజంలో ఎక్కడైనా అసమానతలు, అన్యాయాలు చోటుచేసుకుంటే అక్కడికి వెళ్లి ప్రజల పక్షాన నిలుస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలు, ఎన్నికల విజయాలకే పరిమితమవుతున్నాయని, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటూ, పోలీసు బలగాలను ప్రయోగించి భూములను లాక్కుంటోందని ఆరోపించారు.
ప్రజల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఎర్రజెండాకే ఉందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని, లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
మహాసభల సందర్భంగా వికారాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా బుగ్గప్పను మరోసారి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. తనపై విశ్వాసం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి బుగ్గప్ప కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం యాలాల మండల వీఓఏలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, జిల్లా కార్యదర్శి వెంకటయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మహిపాల్, జిల్లా నాయకులు గోపాల్ రెడ్డి, వివిధ మండలాల నాయకులు, కార్మికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
