మిరుదొడ్డిలో పోలీసుల అప్రమత్త - మహిళకు ప్రాణదానం
కానిస్టేబుళ్లు రాజు, బాబులను అభినందించిన గ్రామస్తులు
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఆమె, ఆవేశంలో గ్రామంలోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్టు పోలీసులు రాజు, బాబు ఘటన స్థలానికి చేరుకుని అప్రమత్తంగా స్పందించారు. చెరువులో మునిగిపోతున్న మహిళను స్థానికుల సహాయంతో నీటిలోకి దిగి బయటకు తీసుకొచ్చారు. ఐతే ఆమె అప్పటికే అపస్మారక స్థితిలో ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. ఈ కీలక సమయంలో పోలీసులు తమ ప్రాథమిక వైద్య నైపుణ్యాన్ని వినియోగించి సీపీఆర్ (CPR) నిర్వహించారు. కొద్ది సేపటికి ఆమెకు శ్వాస సక్రమంగా తిరిగి రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆమెను మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించి, సాహసంతో పాటు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు రాజు, బాబులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. వారి సేవలను ఉన్నతాధికారులు కూడా ప్రశంసించారు.

