నిరుద్యోగ నిరసన: ఖాళీలు భర్తీ చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి మండిపాటు
2లక్షల ఉద్యోగాల భర్తీకి తక్షణ డిమాండ్
హైదరాబాద్:
రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా యువతను మోసం చేస్తోందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు, 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయకపోవడం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని దుయ్యబట్టారు.
*కీలక శాఖల్లో నిలిచిన నియామకాలు
పోలీస్ శాఖలో 18 వేల కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మైనారిటీ, ఎయిడెడ్ పాఠశాలల్లో 30 వేల ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పక్కన పెట్టడం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని రామకోటి విమర్శించారు. ఐటీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల్లో కూడా ఉద్యోగాల భర్తీని నిలిపివేసి, నిరుద్యోగులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*అల్లంపల్లి రామకోటి
*ఆందోళనలు ఉధృతం చేస్తాం
ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే, నిరుద్యోగుల పక్షాన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని రామకోటి హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
