జీ.హెచ్.ఎం.సీ మలక్పేట్ యార్డులో ‘డీజిల్’ దందా! 12 ఏళ్లుగా సాగుతున్న భారీ దోపిడీ!
- *విద్యుత్ ఉన్నా జనరేటర్ల పేరిట వేలాది లీటర్ల స్వాహా!
- *‘ఫిట్టర్ ఇసాక్’ లీలలు.. బంక్ డీలర్లు, అధికారుల కుమ్మక్కుపై విచారణకు డిమాండ్.
- పూర్తి ఆధారాలు పొందుపరిచి అవినీతిపరుల పేర్లు సహా వ్రాసినా.. కమిషనర్ ఆర్వీ కర్ణన్ చర్యలు ఎక్కడ..
- ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం..
*హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మలక్పేట్ వాహన నిల్వ కేంద్రం (పార్కింగ్ యార్డ్) అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. గత పది, పన్నెండేళ్లుగా ఇక్కడ ఇంధనం (డీజిల్) వినియోగం పేరిట అక్షరాలా ప్రజా ధనం నడిరోడ్డుపై కొల్లగొట్టబడుతోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలపై సమగ్ర విచారణ జరపాలని పౌర సమాజం గట్టిగా డిమాండ్ చేస్తోంది.
*డీజిల్ దొంగతనం ‘ఫిట్టర్ ఇసాక్’దే ప్రధాన పాత్ర!
ఈ ఇంధన దోపిడీ సామ్రాజ్యంలో జనరేటర్ ఆపరేటర్, "ఫిట్టర్ ఇసాక్" పాత్ర అత్యంత కీలకంగా మారినట్లు తెలుస్తోంది. తానే జనరేటర్ ఇన్ఛార్జ్నంటూ చెలామణి అవుతున్న ఈ ‘డీజిల్ దొంగ’ వీరన్న.. క్షేత్రస్థాయిలో కరెంట్ ఉన్నా లేకపోయినా నకిలీ లెక్కలు చూపించడంలో సిద్ధహస్తుడు.
* నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నప్పటికీ, అత్యవసర విద్యుత్ జనరేటర్ల వినియోగం పేరిట ప్రతి నెలా సుమారు 500 లీటర్ల ఇంధన కూపన్లను ఇసాక్ అక్రమంగా క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
* క్షేత్రస్థాయిలో జనరేటర్లు అస్సలు నడవకపోయినా.. కాగితాల్లో మాత్రం వేలాది లీటర్ల డీజిల్ కరిగిపోతుండటం వెనుక ఇసాక్ నడిపిన మాయాజాలమే ప్రధాన కారణమని సిబ్బంది కోడై కూస్తున్నారు..jpeg)
యార్డులో కేవలం వాహన చోదకులుగా (డ్రైవర్లుగా) పనిచేస్తున్న తాహెర్, అబ్దుల్లా అనే ఇద్దరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్కడి పర్యవేక్షకులుగా (కేర్టేకర్లుగా) అవతారమెత్తారు. ఇసాక్ లాంటి వారితో జతకలిసి వీరిద్దరే అనాధికారికంగా ఇంధన కూపన్లను జారీ చేస్తున్నట్లు సమాచారం.
*నకిలీ రికార్డుల సృష్టి: వాహనాలు అసలు రెండో షిఫ్ట్ (మధ్యాహ్నం), నైట్ షిఫ్ట్ (రాత్రి) సమయాల్లో షెడ్డు దాటి బయటకు రాకపోయినా, ఆ సమయాల్లో కూడా డ్యూటీ చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు.
*10 రోజులు సరఫరా బంద్.. కానీ బిల్లులు మాత్రం ఫుల్!
మలక్పేట్ యార్డుకు ఇంధనాన్ని సరఫరా చేసే పెట్రోల్ బంక్ నిర్వాహకులు.. తమకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి బిల్లుల చెల్లింపులు రాలేదనే నెపంతో ప్రతి నెలా దాదాపు 10 రోజుల పాటు ఇంధన సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వాహన చోదకులే అంగీకరిస్తున్నారు.
*ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది!
నెలలో 10 రోజుల పాటు ఇంధన సరఫరా నిలిచిపోయినప్పుడు, నెలాఖరులో మాత్రం ఆ పూర్తి నెలకు కేటాయించిన మొత్తం ఇంధన పరిమాణానికి సంబంధించిన బిల్లులు ఎలా పాస్ అవుతున్నాయి? సరఫరా ఆగిపోయిన రోజుల్లో కూడా "ఫిట్టర్ ఇసాక్" మరియు కేర్టేకర్ల గ్యాంగ్ డీజిల్ వాడినట్లు ఎలా బిల్లులు పుట్టించారు? ఇంధన సరఫరాదారులు, మున్సిపల్ ఉన్నతాధికారులు కుమ్మక్కై ఈ నకిలీ బిల్లుల దందాకు తెరలేపినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.
నకిలీ బిల్లుల సృష్టి ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న భారీ కుంభకోణంలో ప్రధాన ఇంధన సరఫరా కేంద్రాలు (పెట్రోల్ బంకులు) ప్రస్తుతం నిఘా నీడలోకి వచ్చాయి. ఈ అక్రమాలకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాటిలో ముఖ్యంగా మూడు కేంద్రాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అవి:
1. *ఎం. ఏ. రెహమాన్* (భారత్ పెట్రోలియం సరఫరాదారు)
2. *డెక్కన్ పెట్రోలియమ్స్* (ఇంధన సరఫరాదారు)
3. *ఏ. వై. ఫిల్లింగ్ స్టేషన్* (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ - BPCL)
ఈ సంస్థలు నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాయనే అంశంపై అధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు.
ఈ మూడు కేంద్రాల ద్వారా గత కొన్నేళ్లుగా జరిగిన ఇంధన సరఫరా, సమర్పించిన బిల్లులు, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలపై సిట్టింగ్ జడ్జితో లేదా విజిలెన్స్ విభాగంతో నిశితంగా పరిశీలన చేయించాల్సిన అవసరం ఉంది.
*తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి!
గత 12 ఏళ్లుగా సాగుతున్న ఈ ఇంధన చీకటి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలించాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రింది చర్యలు చేపట్టాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది:
*విభాగాల వారీగా విచారణ: ఈ కుంభకోణంపై తక్షణమే అంతర్గత మరియు ఏసీబీ (ACB) విభాగాల వారీగా ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించాలి.
*రికార్డుల లెక్కింపు: గత 12 ఏళ్లుగా జారీ చేసిన ఇంధన కూపన్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి.
*లాగ్బుక్స్తో సరిపోల్చడం: వాహనాల కదలికల రిజిస్టర్లను, ఫిట్టర్ ఇసాక్ సమర్పించిన డీజిల్ వినియోగ రికార్డులతో సరిపోల్చి క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలి.
*ఆర్థిక ఆడిటింగ్: సదరు మూడు పెట్రోల్ బంక్ నిర్వాహకులకు సంబంధించిన ఒరిజినల్ బిల్లులు, బ్యాంకు చెల్లింపులపై సమగ్ర ఆడిటింగ్ జరపాలి.
*కఠిన చర్యలు: ఈ సుదీర్ఘ అవినీతి దందాలో భాగస్వాములైన కింది స్థాయి ఫిట్టర్ ఇసాక్, కేర్టేకర్ల నుండి మొదలుకొని వారికి సహకరించిన ఉన్నతాధికారులు మరియు డీలర్లపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
పారదర్శకమైన విచారణ ద్వారానే ఈ 'ఇంధన చీకటి దందా' వెనుక ఉన్న పెద్ద తలకాయల గుట్టు రట్టవుతుందని, దోచుకున్న ప్రజాధనాన్ని రికవరీ చేయవచ్చని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
