మీరు భయపడ్డారా.. అంతే సంగతులు...
సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని రాచి రంపాన పెడతారు..
- రోజు రోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు..
- యువత, వృద్దులు, మహిళలే టార్గెట్..
- రక రకాల పేర్లతో ఏమారుస్తారు..
- లేని సుఖం కోసం అర్రులు చాచే వాళ్ళు వీరి వలలో చిక్కుకుంటారు..
- ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ఆశచూపి మోసం చేస్తారు..
- కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పంథాను అనుసరిస్తున్నారు..
- నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు ఈ నేరాలకు పురిగొల్పుతున్నాయి..
- ఒక్కసారి వీరి వలలో చిక్కుకున్నారా ఇక బయటకు రాలేరు..
- కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకోవచ్చు..
- ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులను సంప్రదించండి..
- ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వారు అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఈజీ మనీ.. సులువుగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతోంది.. ఎలాంటి కష్టం చేయకుండానే చేతిలో డబ్బులు వచ్చి పడాలి అనుకుంటారు.. ఇలాంటి వారినే టార్గెట్ చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు.. మీకు ఎదో రకంగా ఆశ చూపిస్తారు.. తమ పరిధిలోకి మిమ్మల్ని తీసుకుంటారు.. తొలుత ఫ్రీగా కొన్ని ప్రయోజనాలు మీకు అందేలా చేస్తారు.. ఇక మీ జీవితాలతో ఆడుకుంటారు ఇది ఒక రకం.. ఇక రెండవది భయం.. ప్రతి చిన్న విషయానికీ భయపడే వారిని వీరు టార్గెట్ చేస్తారు.. మీలో ఉన్న భయం ఆధారంగా మిమ్మల్ని మేనిప్లేట్ చేస్తారు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, టీనేజ్ వాళ్ళు వీరి వలలో చిక్కుకుంటారు.. అలాంటి వారిని చాలా ఈజీగా మోసం చేసేస్తారు.. ఇక మూడవరకం ఊహకు అందని అనుభవాలను కోరుకునే వారు ఉంటారు.. వీరిలో కాలేజీ స్థాయి విద్యార్థులు, పెళ్ళైన మహిళలు, ఒంటరిగా జీవిస్తున్నవారు.. వీరికి ఎన్నెన్నో మాయ మాటలు చెబుతారు.. ఆనందం మీవెంటే ఉంటుందని ఊరిస్తారు.. సుఖాలు అనుభవించవచ్చు అని ఆశలు రేకెత్తిస్తారు.. ఇలాంటి వారిని కూడా తమ అదుపులోకి తీసుకుంటారు సైబర్ నేరగాళ్లు తమ ఇష్టానుసారం ఆడిస్తారు.. దోచుకుంటారు.. కనుక వాస్తవంలో జీవించడం అలవరచుకోవాలి.. అదుపులేని కోరికలను అదుపు చేసుకోవాలి.. కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి.. ఏ అవసరం ఉన్నా పోలీసుల సహాయం తీసుకోవాలి.. అప్పుడే సైబర్ నేరగాళ్ళను కట్టడి చేయవచ్చు..
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను లక్షంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్లతో ఏమార్చి ప్రజలను దోచుకుంటున్నారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులతో మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేర్లతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినబడుతోంది. సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి.. వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం, నిపుణులు పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా 10 రకాల మోసాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అవేంటో ఫోరం యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ మీకు అందిస్తోంది..
మొబైల్ నెంబర్ కనుక్కుని మోసం చేస్తారు :
మీ మొబైల్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నట్టు టెలికం రెగ్యులెటరీ అథారిటీ నుంచి ఫోన్ వస్తుంది. మీ ఫోన్ సేవలు నిలిపివేయకూడదంటే అధికారితో మాట్లాడాలంటూ సైబర్ నేరగాళ్లు భయపెడతారు. సైబర్ క్రైమ్ సెల్ పోలీసు అధికారిగా మిమ్మల్ని భయపెట్టి ఏమార్చాలని చూస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏటంటే ట్రాయ్.. ఫోన్ సేవలు నిలిపివేయదు. టెలికం కంపెనీలు మాత్రమే ఆ పని చేస్తాయి.
పార్సిల్స్ పేరుతో పెద్ద స్కాం :
నిషేధిత వస్తువులతో కూడిన పార్శిల్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, ఈ కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఫోన చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్కనెక్ట్ చేసి పోలీసులను సంప్రదించాలి. బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన నంబరును పోలీసులకు ఇవ్వాలి.
కొత్తగా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటూ మోసం :
మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని ఎక్కడికి వెళ్లినా తమ నిఘాలోనే ఉండాలని స్కామర్లు బెదిరిస్తారు. పోలీసులు, సీబీఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు గుంజాలని చూస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. వాస్తవం ఏమిటంటే పోలీసులు డిజిటల్ అరెస్టులు లేదా ఆన్లైన్ విచారణలు ఎప్పుడు కూడా చేయరు.. ఇది గుర్తుంచుకోండి..
హాస్టల్ లో ఉంటూ చదువుకునే తల్లిదండ్రులను టార్గెట్ చేయడం :
కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మీ అబ్బాయి లేదా అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని మీకు ఫోన్ కాల్ వస్తే ఖచ్చితంగా అనుమానించండి.. ఎందుకంటే సైబర్ స్కామర్లు ఇలాంటి ట్రిక్స్తో చాలా మందిని బురిడీ కొట్టించారు. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు చిక్కుల్లో పడ్డారనగానే ఎవరికైనా కంగారు పుడుతుంది. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా స్థిమితంగా ఆలోచించాలి. ఆపదలో చిక్కుకున్నారని చెబుతున్నవారితో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించండి. సులువుగా వారి వివరాలు మీకు తెలిసిపోతాయి..
స్టాక్ మార్కెట్ పేరుతో నిలువునా ముంచేస్తారు :
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వెంటనే ఎక్కువ లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ఎక్కువుగా ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడి ఆశ చూపి స్కామర్లు జనాన్ని కొల్లగొడుతున్నారు. స్వల్పకాలంలోనే అత్యధిక రాబడి వస్తుందని ఆశ పడితే అసలుకే మోసం రావొచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం..
తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బుల సంపాదన అంటూ మోసం :
చిన్నచిన్న పనులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ముగ్గులోకి లాగుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఉదాహరణకు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తారు. చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తమతో పాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి.. భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈజీ మనీ పథకాలు స్కామ్లని గుర్తిస్తే సైబర్ చోరుల బారిన పడకుండా మీరు తప్పించుకోగలుగుతారు..
క్రెడిట్ కార్డుల పేరుచెప్పి దోచేస్తారు :
మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్తో భారీ లావాదేవి జరిగిందని, దీన్ని నిర్ధారించుకోవడానికి ఫోన్ చేసినట్టు మీకు ఫోన్ వస్తే కాస్త ఆలోచించండి. సాయం చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేసిన వ్యక్తి.. మీ కాల్ ని మరొకరికి కాల్ ఫార్వార్డ్ చేస్తాడు. మిమ్మల్ని నమ్మించిన తర్వాత సీవీవీ, ఓటీపీ అడిగి ముంచేస్తారు. మీ పేరుతో క్రెడిట్ కార్డు ఉన్నయిట్టయితే, దాంతో చేసే లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ ఏదైనా అనుమానం కలిగితే బ్యాంకును సంప్రదించాలి. అంతేకానీ అపరిచితులకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి.
డబ్బులు జమ అయ్యాయని ఫేక్ మెసేజీల ద్వారా వల వేస్తారు :
కొంత నగదు బ్యాంకు ఖాతాలో పడినట్టు స్కామర్లు మీ ఫోన్కు ఫేక్ మేసేజ్ పంపిస్తారు. తర్వాత మీకు ఫోన్ చేసి.. పొరపాటున నగదు బదిలీ అయిందని, తన డబ్బు తిరిగిచ్చేయాలని మస్కా కొడతారు. నిజంగా ఆ మేసేజ్ బ్యాంకు నుంచి వచ్చింది కాదు. నగదు బదిలీ కూడా అబద్ధం. ఎవరైనా ఇలాంటి ఫోన్ కాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. నిజంగా నగదు బదిలీ జరిగిందా, లేదా అనేది నిర్ధారించుకోండి. తరువాత బ్యాంకు అధికారులను, పోలీసులను సంప్రదించండి..
కేవైసీ పేరు చెప్పి మోసం చేయడం మరో టెక్నీక్ :
కేవైసీ గడువు ముగిసిందని, అప్డేట్ చేసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి అంటూ.. ఎస్ఎంఎస్, కాల్, ఈ-మెయిల్ ఏవైనా వస్తే జాగ్రత్త పడండి. పొరపాటున ఈ లింకులు క్లిక్ చేస్తే మీరు స్కామర్ల బారిన పడినట్టే. ఈ లింకులు స్కామర్ల డివైజ్లకు కనెక్ట్ అయివుంటాయి. కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లింకుల ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పవు. నేరుగా వచ్చి మాత్రమే కేవైసీ వివరాలు ఇమ్మని అడుగుతాయి గుర్తుంచుకోండి..
ట్యాక్స్ పే చేసే వారిని పకడ్బందీగా పట్టుకుంటారు :
ట్యాక్స్పేయర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నావారికి ఫోన్ చేసి తమను తామును అధికారులుగా పరిచయం చేసుకుంటారు. ట్యాక్స్ రిఫండ్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించాలని కోరతారు. డిటైల్స్ చెప్పగానే మీ బ్యాంకు అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేస్తారు. ట్యాక్స్పేయర్ల బ్యాంకు ఖాతాల వివరాలు పన్నుల శాఖ వద్ద ఉంటాయి. కాబట్టి వారికే నేరుగా ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తాయి. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను అసలు నమ్మకండి.
కొన్ని జాగ్రత్తలు తీసుకోండి :
మీరు దేనికైనా స్పందించే ముందు సమాచారాన్ని ఖచ్చితంగా ధృవీకరించుకోండి.. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకండి..
మీ నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారా నిర్ధారించుకోండి.. అనుమానాస్పద కాల్లు/నంబర్లపై ఎప్పటికప్పుడు పోలీసులకు రిపోర్ట్ చేయండి.. ఇక ఈజీ మనీ కోసం ఆశపడి అధిక రాబడి పథకాల పట్ల ఆకర్షితులు కాకుండా జాగ్రత్తగా ఉండండి.. మీ కేవైసీని వ్యక్తిగతంగా అప్డేట్ చేయండి.. అలాగే మీవ్యక్తిగత వివరాలు అదేవిధంగా మీ బ్యాంక్ వివరాలు మీకు తెలియని వారితో అసలు పంచుకోకండి..
మీకు ఏదైనా అనుమానం వచ్చినా.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న వెంటనే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ 1800-11-4000 నెంబర్ కు సమాచారం అందించండి.. అంతే కాకుండా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in లో వివరాలు పంపించండి.. మరీ ముఖ్యంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మర్చిపోకండి.. sancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి
జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తం చేయడానికి " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " నాడు కట్టింది.. మాతో చేతులు కలపండి అమాయకుల జీవితాలను కాపాడే పోరాటంలో భాగస్వాములు అవ్వండి..