అక్రమ ఇసుక వేలం వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ప్రజా సంఘాల ఆరోపణ ఆర్ ఐ పై చర్యలు తీసుకోవాలి
- శివసాగర్ ప్రాజెక్ట్లో జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలి
- లేకపోతే భారీ ఆందోళనలకు సిద్ధం
- ప్రజాసంఘ నాయకుల డిమాండ్
- తాసిల్దార్ కు విజ్ఞప్తి పత్రం అందజేత
వికారాబాద్ :
అక్రమ ఇసుక వేలం లో
అవకతవకలకు పాల్పడుతున్న యాలాల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) శివచరణ్ కుమార్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యాలాల తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య మాట్లాడుతూ, ..అక్రమంగా ఇసుక తరలించిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి డంప్ చేసిన సుమారు 120 ట్రాక్టర్ల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్తో కుమ్మక్కై తరలించేందుకు ఆర్ఐ శివచరణ్ అనుమతులు ఇప్పించారని ఆరోపించారు.
అదేవిధంగా మండలంలోని శివసాగర్ ప్రాజెక్టు నుంచి ఇసుక తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అక్కడ మట్టి, రాయి, చిలప వేసి చేపడుతున్న పనుల వల్ల స్థానిక మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. వెంటనే ఆ పనులను నిలిపివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అక్రమాలకు పాల్పడిన మండల ఆర్ఐపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహేందర్, మెట్లి కృష్ణ, ఆర్ఐ శివచరణ్ బాధితులు తదితరులు పాల్గొన్నారు.
