ఎల్బీనగర్ పోలీసుల చాకచక్యం:

  • హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన కిరాతకురాలు 
  • చున్నీతో భర్త గొంతును నులిమి చంపేసిన భార్య
  • నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు 

ఎల్బీనగర్ పోలీసుల చాకచక్యం:

ఎల్బీనగర్:

ఆత్మహత్యగా భావించిన ఒక అనుమానాస్పద మృతి కేసులోని అసలు గుట్టును ఎల్బీనగర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తన భర్తను అత్యంత దారుణంగా, కిరాతకంగా నొక్కి చంపిన 33 సంవత్సరాల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసు వివరాలు:

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్, క్రైమ్ నెంబర్: 851/2026, సెక్షన్: 103(1) BNS (గతంలో సెక్షన్ 194 BNSS కింద నమోదైన కేసు).

అరెస్ట్ అయిన నిందితురాలి వివరాలు:

శ్రీమతి బోడ స్వరూప, భర్త: (లేట్) బోడ నర్సింగ్, వయస్సు: 33 సంవత్సరాలు, కులం: ఎస్టీ , వృత్తి: కూరగాయల వ్యాపారి, నివాసం: ఇండ్ల నెంబర్: 11-21-1184, ఎల్బీనగర్,ఎన్టీఆర్ నగర్ రంగారెడ్డి జిల్లా. (సొంత ఊరు: తట్టుపల్లి గ్రామం, కొరవి మండలం, మహబూబాబాద్ జిల్లా).

కేసు పూర్వపరాలు : 

ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్,  ఒక అద్దె ఇంట్లో బోడ నర్సింగ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ప్రాథమికంగా, ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా (సెక్షన్ 194 బిఎన్ఎస్ఎస్ కింద) కేసు నమోదు చేయడం జరిగింది. అయితే, ఎల్బీనగర్ పోలీసులు జరిపిన నిశితమైన, లోతైన దర్యాప్తు మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుండి వచ్చిన శవపరీక్ష (పీఎంఇ) నివేదికతో ఇది ఆత్మహత్య కాదని తేలింది. మృతుడి మరణానికి గల కారణం ఉరివేసుకోవడం కాదని, మెడపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి "గొంతు నులిమి చంపడం (స్ట్రాంగ్యులేషన్ ) అని వైద్య నిపుణులు ఖచ్చితమైన నివేదిక ఇచ్చారు.

నేరానికి గల కారణం - అమలు చేసిన తీరు:

నిందితురాలిని విచారించగా, బోడ స్వరూపకు తన సొంత గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గత కొన్ని రోజులుగా వారి మధ్య తీవ్రమైన కుటుంబ కలహాలు జరుగుతున్నాయి.తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వరూప, అతడిని అంతమొందించాలని పథకం వేసింది. ఈ క్రమంలో తేది: శనివారం మధ్యాహ్నం 3  నుండి 4 గంటల మధ్య ఇంట్లో జరిగిన గొడవను ఆసరాగా చేసుకుని, నిందితురాలు తన భర్తను శారీరకంగా లొంగదీసుకుని, అతని ఛాతీపై కూర్చొని తెల్లటి చున్నీతో గొంతు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత చట్టం నుండి తప్పించుకోవడానికి, శవాన్ని ఇనుప మంచానికి చున్నీతో కట్టి అది ఆత్మహత్యగా చిత్రీకరించి చుట్టుపక్కల వారిని, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.

అరెస్ట్ మరియు రికవరీ:

సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీనగర్ పోలీసులు ప్రత్యేక బృందంతో నిందితురాలు బోడ స్వరూపను అల్కాపురి వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన నేరాన్ని పూర్తిగా అంగీకరించింది. నిందితురాలి వద్ద నుండి హత్య జరిగిన వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేయడానికి ఉపయోగించిన వీవో టీ3 స్మార్ట్‌ఫోన్ మరియు హత్యకు ఉపయోగించిన తెల్లటి చున్నీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును హత్య కేసుగా సవరిస్తూ (సెక్షన్ 103(1) బిఎన్ఎస్ కింద మార్చి), నిందితురాలిని గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయంపై ఎల్బీనగర్ పోలీసులు మరింత దర్యాప్తు జరుపుతున్నారని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.

About The Author