ఇందిరా పార్క్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

  • నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలి..
  • ప్లే ఏరియాకు మరమ్మతులు చేపట్టాలి: ఆర్వీ కర్ణన్ ఆదేశం

ఇందిరా పార్క్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నగర పారిశుద్ధ్యం, పార్కుల సుందరీకరణపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇందిరా పార్క్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పార్కులోని పలు విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, అక్కడి నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

​వ్యర్థాలు ఉంటే సహించేది లేదు:

​పార్కు ఆవరణలో అక్కడక్కడా పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాల (C&D Waste)పై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఈ వ్యర్థాలను తక్షణమే తరలించాలని స్పష్టం చేశారు. పార్కును నిరంతరం శుభ్రంగా ఉంచుతూ, ప్రజలను ఆకర్షించేలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

​పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు:

​పార్కులోని చిల్డ్రన్ ప్లే ఏరియా పరిస్థితిని గమనించిన కమిషనర్.. పాడైన ఆట వస్తువులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ‘హుకుం’ జారీ చేశారు. పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ప్లే ఏరియాను వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
​"నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యం. పారిశుద్ధ్య విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు."
— ఆర్వీ కర్ణన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్

​ఈ తనిఖీ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్ మంగతాయారు, కవాడిగూడ డిప్యూటీ కమిషనర్ పుష్పలత, అర్బన్ బయోడైవర్సిటీ (UBD), సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) విభాగాల ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author