సమస్యల పరిష్కారానికి సహకరించండి

  • ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటే ప్రజా ఉద్యమం తప్పదు..
  • బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విన్నవించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

సమస్యల పరిష్కారానికి సహకరించండి

రామచంద్రాపురం :

రామచంద్రపురం డివిజన్ పరిధిలో గల బిహెచ్ఇఎల్ భూములకు సంబంధించి నెలకొన్న వివాదాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని.. కాలయాపన చేస్తే  ప్రజల నుండి వ్యతిరేకత ఎదురుకోవాల్సి వస్తుందని బిహెచ్ఈఎల్ యాజమాన్యానికి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం ఉదయం బిహెచ్ఇయల్ ఈడి శ్రీనివాస్, ఏజిఎం సురన్ ప్రసాద్ లతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు.

ప్రధానంగా ఈఎస్ఐ చర్చి సమీపంలో గల బీరప్ప గుడిని బిహెచ్ఇయల్ పరిశ్రమ భూమిలో ఉందంటూ సంబంధిత అధికారులు తొలగించడం జరిగిందని తెలిపారు. ఇది మాత్రం సమంజసం కాదని.. పరిశ్రమ ఏర్పాటు చేయకముందు నుండి గుడి అక్కడే ఉందని తెలిపారు. వెంటనే అదే స్థలంలో గుడిని పునర్నిర్మాణం చేపట్టకపోతే ప్రజల నుండి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 

రామచంద్రపురం రాయసముద్రం చెరువు సుందరీకరణ అంశంలో ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రజోపయోగ అంశాలలో సహకరించాల్సింది పోయి అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపారు. చెరువు సుందరీకరణ పనులకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకులు తెలపవద్దని విజ్ఞప్తి చేశారు. 

ఈఎస్ఐ సమీపంలో గల క్రిస్టియన్ కమ్యూనిటీ స్మశాన వాటికలో కేవలం బీహెచ్ఈఎల్ ఉద్యోగులకు..వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అంత్యక్రియలకు అనుమతిస్తున్నారని స్థానికులు తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. స్థానికులకు సైతం అనుమతించాలని కోరారు. అదే విధంగా హిందూ స్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పనకు  అభ్యంతరాలు తెలుపవద్దని  కోరారు. 

 ఈ అంశాలపై బుధవారం సాయంత్రం మరో మారు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్లు పుష్ప నగేష్, అంజయ్య, సీనియర్ నాయకులు పరమేష్, ఐలేష్, రామచంద్రపురం పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author