
అధిక వర్షాలతో తెగిపోయిన లింగంపేట్ మండలంలోని లింగంపేట్ కుర్దు వాగు బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి రూట్ లో ప్రధాన రహదారిపై గల ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఈ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రవాణాను పునరుద్ధరించడానికి ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఈ రూట్లో ప్రయాణించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేయాలని ఆర్ అండ్ బి ఈ మోహన్ ను ఆదేశించారు. ఎల్లారెడ్డి డివిజన్లో దెబ్బతిన్న అన్ని రోడ్లు, బ్రిడ్జిల పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని , దెబ్బతిన్న ఇండ్లు, నష్టపోయిన పంటల వివరాలు త్వరగా సేకరించేలా పర్యవేక్షించాలని ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డిని ఆదేశించారు.
లింగంపేట్ బ్రిడ్జిని 12 ఫీట్ల వెడల్పుతో నిర్మించాలి పోల్కంపేట్ గ్రామంలో తెగినపెద్ద చెరువు కుంటలు మరమ్మత్తులు చేపట్టాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ కామారెడ్డి జిల్లా (భారత శక్తి ప్రతినిధి) ఆగస్టు 30: శనివారం జిల్లాలోని సిపిఎం పార్టీ జిల్లా బృందం లింగంపేట్ మండలంలోని లింగంపేట బ్రిడ్జిని చేరుకొని తెగిపోయిన బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, పాత బ్రిడ్జి ఐదు ఫీట్ల వెడల్పుతోని 100 సంవత్సరాల క్రితం నిర్మించిందని, ఇప్పుడు తాత్కాలికంగా పనులు నడుస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెంటనే మూడు కోట్ల రూపాయలు చెల్లించి 12 ఫీట్ల వెడల్పుతో కొత్త బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇది ఇట్లానే కొనసాగిస్తే భవిష్యత్తు తరాలకు ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు అనంతరం పోల్కంపేట గ్రామాన్ని సందర్శించి తెగిపోయిన పెద్ద చెరువు చిన్న చెరువులను పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మార్వో ఎంపీడీవో లను గ్రామానికి పిలిచి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పై అధికారులకు తెలియజేయాలని నిలదీయడం జరిగింది. స్పందించిన ఎమ్మార్వో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, నాయకులు మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు.